(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తమ ఎమ్మెల్సీలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నదని టిడిపి చేస్తున్న ఆరోపణలను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టామో టిడిపి నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు అని విమర్శించారు.
చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామనీ, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయారో చూశామనీ బొత్స అన్నారు. శాసనమండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనమండలిలో నిబంధనలకు టిడిపి తూట్లు పొడిచిందని విమర్శించారు. సూచనలు చేయాల్సిన మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనీ, మండలి చైర్మన్ షరీఫ్ టిడిపి కార్యకర్తలా వ్యవహరించారనీ బొత్స విమర్శించారు.
స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని అన్నారు. నిబంధనలు పాటించని మండలి అవసరమా లేదా అన్న చర్చ రాష్ట్రమంతా జరుగుతోందని ఆయన అన్నారు.