అమరావతి, మార్చి 11 : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మైలవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి వసంత వెంకట కృష్ణ ప్రసాద్తో కలిసి దేవినేని చంద్రశేఖర్ సోమవారం జగన్మోహనరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.
దేవినేని చంద్రశేఖర్ 2012లో వైసిపిలో చేరి ఆరు నెలల పాటు ఉన్నారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు , కుటుంబ సభ్యుల వత్తిడితో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. నేడు వసంత కృష్ణప్రసాద్ ద్వారా మళ్లీ వైసిపిలోకి చేరారు. అనేక కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రశేఖరరావు తెలిపారు. వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రావణుడి లంక నుండి విభీషణుడు బయటకు వచ్చినట్లుగా అబివర్ణించారు.
నిత్యం ప్రధాన ప్రతిపక్షం వైసిపి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసిపి తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?