(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపిలో తిరుగులేదు. వైఎస్ జగన్మోహనరెడ్డికి సిఎంగా ప్రస్తుతానికి ఎదురులేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. దానికి ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీని బలహీనపర్చడం, అసెంబ్లీలో చంద్రబాబును ఒంటరిని చేయడం, ప్రతిపక్ష హోదా లాగేయడం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేసి అనధికారికంగా వైసీపీలో చేర్చుకున్న సీఎం జగన్మోహనరెడ్డి ఇంకొంత మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాకు చెందిన ఒ కీలక ఎమ్మెల్యే (గంటా శ్రీనివాసరావు కాదు)ను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు పార్టీ పావులు కదుపుతుందని సమాచారం. త్వరలో జరగనున్న విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గైవశం చేసుకోవాలంటే ఆ పార్టీలోకి ఈ ఎమ్మెల్యే రావడం తప్పనిసరి అని వైసీపీ భావిస్తోంది. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే, ఏమిటా కథ చూద్దాం.
కృష్ణాజిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ దశాబ్దాల కాలం క్రితమే విశాఖలో షటిల్ అయ్యారు. టీడీపీలో కీలక నేత. విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ ను వైసీపీలోకి తీసుకువస్తే విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించడం సునాయాసం అవుతుందని వైసీపీ భావిస్తున్నదట. అందుకే వెలగపూడి రామకృష్ణ ను వైసీపీలోకి చేర్చుకోవాలని జగన్ యోచిస్తున్నారట. వెలగపూడి రామకృష్ణతో మంత్రి కొడాలి నానికి అనుబంధం ఉండటం, ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయనను వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నానికి అప్పగించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి వెలగపూడికి పార్టీ మారే ఆలోచన ఏదీ లేనప్పటికీ టీడీపీ కార్యక్రమాలకు గత కొద్ది కాలంగా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన రాజకీయంపై కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గడచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచిన సందర్భంలో విశాఖ పట్టణంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవశం చేసుకున్నది. విశాఖ ఎంపి స్థానం వైసీపీ కైవశం అయినా విశాఖ నగరంలో మాత్రం టీడీపీ హవానే కొనసాగింది. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్న నేఫథ్యంలో అక్కడ ప్రతిపక్షాన్ని జీరో చేయాలన్న తలంపుతో వ్యూహాలను సిద్ధం చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో వెలగపూడి గనక వైసీపీలోకి వస్తే 2024 ఎన్నికల్లో విశాఖ తూర్పు సీటు ఇవ్వడంతో పాటు గెలుపునకు అన్ని విధాలుగా వైసీపీ తోడ్పాటు అందిస్తుంది అన్న హామీ కూడా ఇస్తున్నారట. వెలగపూడి విషయంలో మంత్రి నాని మంత్రాంగం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.