విశాఖ జిల్లా సంహాచలం దేవస్థానం గత కొద్ది రోజులుగా ఏదో ఒక వివాదంతో సతమతమవుతున్నది. ఈ ఆలయానికి సంబంధించి వివాదాలు గతంలో పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల కాలంలో ప్రతిదీ వివాదాస్పదం అవుతున్నది. సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆమె నియామకం, ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అత్యంత గోప్యంగా సాగడంపైనా నాడు విమర్శలు వచ్చాయి. ఆ తరువాత చైర్ పర్సన్ సంచయిత గజపతి తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఆలయానికి సంబంధించి గోశాలలో. ఆలయంలో పని చేస్తున్న ఆవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం ఆ తరువాత ప్రభుత్వ జోక్యంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం , చైర్ పర్సన్ సంచయిత పర్సనల్ అసిస్టెంట్ ఒకరు కొండపైనే తిష్టవేసి ఆలయ రికార్డులు పరిశీలన, పాలనా పరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, తాను బాధ్యతలు నిర్వహించలేనంటూ ఇఒ బ్రమరాంబ తప్పుకోవడం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి ఆలయంలో జరుగుుతన్న వ్యవహారాలపై ఆమె లేఖలు రాయడం, చైర్ పర్సన్ చర్యలపై ప్రశ్నలను సంధించడం ఇలా ప్రతిదీ వివాదానికి దారి తీశాయి.
తాజాగా సింహాచలం దేవస్థానం బంగారం అమ్మకం పేరుతో ఒ మహిళను కోటి 40 లక్షల మోసానికి పాల్పడిన కేసు వెలుగులోకి రావడం తీవ్ర సంఛనం కల్గించింది. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించి విచారణకు ఆదేశించారు. దేవస్థానం పేరుతో రసీదులు ఎక్కడ ముద్రించారు. ఆలయ సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే విషయాలపై విచారణ జరపాలని మంత్రి వెల్లంపల్లి అదేశించారు. మంత్రి ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ అధికారిగా దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ ను నియమించారు.
ఈ కొత్త వివాదం ఏమిటంటే….
సింహాచలం కొండపై ఉంటున్న కోన హైమవతి అనే మహిళ ఆలయానికి చెందిన బంగారం విక్రయిస్తున్నామని నమ్మించి కోటి 40 లక్షలు తీసుకొని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఎం శ్రావణి ని మోసం చేసింది. బాధితురాలు శ్రావణికి పంపిన రసీదులు నకిలీవి అని తేలిసింది. నకిలీ బిల్లులు, ఇఒ సంతకం ఫోర్జరీతో ఆమె ఈ మోసానికి పాల్పడింది. ఈ వ్యవహారం బయటపడటంతో ఆలయ ఏఇఒ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఒ పక్క పోలీసులు విచారణ జరుపుతుండగా మంత్రి వెల్లంపల్లి కూడా స్పందించారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.