నరసాపురం వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఎలా మలుపులు తిరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అతనిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీల బృందం వెళ్లి స్పీకర్ ను కలిశారు. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో వైపు ఎంపి రాజు గారు మాత్రం తన ఫందాను వీడటం లేదు. పార్టీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రాజు గారిని పార్టీ నుంచి అలాగే పార్లమెంట్ నుంచి ఒకే సారి బయటకు పంపేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహ రచన చేస్తోంది. దానిలో భాగంగానే ఎంపిల బృందం.. న్యాయ నిపుణులతో చర్చించి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిల్లా కు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో మంత్రి శ్రీరంగనాథరాజుకి, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అదే క్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వీరందరికీ అందరికీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏమాత్రం పొసగడం లేదు. దీంతో జిల్లాలో పోలీసులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రఘురామ కృష్ణంరాజు కు కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని జిల్లాలో మాటలు వినిపిస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులు కూడా రెండు వైపులా వత్తిళ్లు వస్తున్నాయని భయపడుతున్నారు. రఘురామ కృష్ణం రాజు ఇటీవల జిల్లాలో కీలక అధికారులను కలిసి బిజెపి పెద్ద నుంచి ఫోన్ చేయించారని, తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. తాజాగా మంత్రి పిఏ రఘురామ కృష్ణం రాజు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం గమనార్హం. మంత్రి శ్రీరంగనాధ రాజు పై ఎంపీ రఘురామకృష్ణంరాజు అమర్యాదకరంగా, అసభ్యకరంగా మాట్లాడారని అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పిఏ ఫిర్యాదు చేశారు. దాన్ని పోలీసులు పట్టించుకోకుండా కోర్టు కు వెళ్లాలని సూచించడంతో జిల్లాల్లో మంత్రికి, ఎంపికి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి చుట్టూ తిరిగి అధికార పార్టీకి, అధికారులకు మధ్య నలిగి పోతున్నాయి.