(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
రాజధాని అమరావతి రెఫరెండంగా తాను రాజీనామా చేయడానికి సిద్ధమని వైసీపీ రెబర్ ఎంపి రఘు రామ కృష్ణం రాజు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రఘు రామ కృష్ణం రాజు చేసిన సవాల్ పై ఏపి మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంలోనే పలు సంచలన వ్యాఖ్యలూ చేశారు. రాజధానిపై నిర్ణయం ఏమిటో తాము తరువాత చెబుతాం ముందుగా రఘు రామ కృష్ణం రాజును రాజీనామా చేయమని చెప్పండి అన్నారు బొత్సా సత్సనారాయణ. రాజధానితో సంబంధం లేకుండా రఘు రామ కృష్ణం రాజు రాజీనామా చేయాలని ముందే చెప్పామన్నారు.
రాజధాని కుంభకోణంలో చంద్రబాబు పాత్ర
అమరావతి రాజధాని కుంభకోణంలో నారా చంద్రబాబు పాత్ర ఉందని బొత్స సత్యనారాయణ మరో సారి ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములను నారా చంద్రబాబు, నారా లోకేష్ దోచేశారనీ విమర్శించారు బొత్స సత్యనారాయణ. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ బినామీలు భూములు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు బొత్స. అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులు ఎవరూ భూములు కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు బొత్సా. రాజధాని ప్రాంతంలో క్విడ్ ప్రోకోకు పాల్పడింది వాస్తవం కాదా అని బొత్సా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూ అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడి అయితే నారా చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు కూడా ఎఫ్ ఐ ఆర్ లో పెడతారని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ.
కరోనా కారణంగానే రాజధానిలో పనులకు ఆటంకం
కరోనా కారణంగానే రాజధాని ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదనీ అన్నారు బొత్స సత్యనారాయణ. బాధ్యత కల్గిన మంత్రిగా స్పష్టం చేస్తున్నా.. రాజధాని గ్రామాల్లో త్వరలో పనులను ప్రారంభిస్తామని బాధ్యత కల్గిన మంత్రిగా స్పష్టం చేస్తున్నానన్నారు.