అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలపై దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుండగా స్పీకర్ జోక్యం చేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై మాట్లాడటాన్ని తప్పుబడుతూ మైక్ కట్ చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత సమాధానం ఇస్తూ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశామనీ, అట్రాసిటీ కేసు నమోదు చేశామనీ తెలిపారు. బాలిక కుటుంబానికి పరిహారం అందజేస్తామని సుచరిత పేర్కొన్నారు.