సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్నాళ్లు సంక్షేమ రధాన్ని పరుగులు పెట్టించారు. పరిపాలనా రధాన్ని పట్టాలు ఎక్కించారు. అక్కడక్కడా ఆరోపణలు, వివాదాలు, విమర్శలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అన్ని కలిసిన దాఖలాలు లేవు. జగన్ మాటకు ఎదురే లేకుండా రాష్ట్రంలో పరిపాలన సుభిక్షంగా సాగింది. అయితే జగన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం వ్యతిరేక పక్షాలను ఏకం చేసేదిలా ఉంది. ఆ నిర్ణయం అమలు అయితే రైతులకు మేలు జరుగుతుందని వైసిపి ప్రభుత్వం చెబుతుండగా రైతులకు మేలు కంటే కీడే ఏక్కువ అని విపక్షాలు అన్నీ ఆరోపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వంపై పోరాడటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే దిశగా విపక్షాలు అన్నీ అడుగులు వేస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలులో భాగంగా నగదు బదిలీ విధానానికి మీటర్లు బిగించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత విద్యుత్ మీటర్ల బిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, దానిని వ్యతికేకిస్తూ అక్కడి నుండే విద్యుత్ మీటర్లను పగులగొట్టే కార్యక్రమాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి కార్యక్రమానికి చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీగా మార్చడం తగదని ఆయన అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా కన్పిస్తోందని పేర్కొన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా సమైక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కరోన కేసుల ఉదృతికి ప్రదాన మంత్రి మోడీనే కారణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కరోనా పరిస్థితులను అడ్డుపెట్టుకొని బలవంతంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని చూడటం తగదని వడ్డే అన్నారు.
విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నేతలు, సామాజిక ఉద్యమ కారులు, విశ్లేషకులతో చర్చా వేదిక నిర్వహించి దీనిపై ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్, రైతు సంఘాల సమాఖ్య రాష్ట నాయకుడు ఏర్నేని నాగేంద్రనాధ్, ఏఐకెఎస్ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య , రాజకీయ విశ్లేషకులు సయ్యద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వై కేశవరావు తదితరులు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కు ఆయన తనయుడు జగన్ తూట్లు పొడవడం దుర్మార్ఘమైన చర్య అని అన్నారు. కరోనా సమయంలో ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా విద్యుత్ మీటర్లు బిగింపు ను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యుత్ మీటర్ల బిగింపును ఎన్ టి ఆర్ వ్యతిరేకించారని గుర్తు వారు చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా మీటర్ల వ్యవస్థను ప్రవేశపెడితే దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ల బిగింపు చర్యలను ప్రభుత్వం తక్షణమే విడనాడాలని నేతలు డిమాండ్ చేశారు.