విజయవాడ: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన విడుదల చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదోడికి కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ను నిజాయితీగా అమలు చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.
చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారికి జిఎస్ టి నుంచి మినహయింపు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సిపిఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని రఘువీరారెడ్డి ప్రకటించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:
- ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా
- వికలాంగులకు మూడు వేల రూపాయల పింఛను
- రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
- వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి
- దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
- ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మాదిరిగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధత కూడిన సబ్ప్లాన్
- స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర
- ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
- విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు
- ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం
- రాజీవ్ ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులు చేరుస్తాం
- కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ
- పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్ టి పరిధిలోకి తీసుకొచ్చి ధరల నియంత్రణ
- 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి రెండు వేల రూపాయల పింఛను
- 60-70 ఏళ్ల వారికి 2,500 రూపాయలు, 70 ఏళ్లు దాటిన వారికి మూడు వేల రూపాయల పింఛను
- ఒంటరి మహిళలకు పెన్షన్
- సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్ విధానం తొలగింపు