ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
రాష్ట్ర ఎన్నికల అధికారి పరిపాలనలో జోక్యం చేసుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారు. కుంటి సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును ప్రజలు అందరూ తప్పుబడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు. ఎన్నికలు నిర్వహించే విధి మాత్రమే ఈసికి ఉంటుంది. ‘ఇది కరోనా వైరసా..కమ్మోనా వైరాసా!!’
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అంతుబట్టని వైరస్ సోకింది. ఎన్నికలు వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుండి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్ కుమార్ ఎలా నిర్ధారణకు వచ్చారు. ఎన్నికలు అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారు.
రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సిఎం జగన్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో స్థానిక ఎన్నికలను జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితమే తాను ఫిర్యాదు చేశా. కరోనా వైరస్పై సిఎం జగన్ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్ను రాష్ట్రపతి, గవర్నర్, డబ్ల్యుహెచ్ఒ, నేషనల్ హ్యూమన్ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తా. ప్రజలు చచ్చినా ఫర్వాలేదు కానీ తాను రాజకీయ లబ్దిపొందాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రక్షణను పెంచుకోవాలి.
మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి
ఏపి సిఎం జగన్ చాలా తెలివైనవాడు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం స్వాగతించదగిన నిర్ణయమే. ప్రతి ఒక్కరికీ సామాజిక వర్గం ఉంటుంది. అది లేని వారు ఎవరో జగన్ చెప్పాలి.
టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర
ఎస్ఇసి రమేష్ కుమార్కు కులాన్ని ఆపాదించడం దురదృష్టకరం. సిఎం స్థాయి వ్యక్తి కులాల గురించి మాట్లాడటం నీచం. ఎన్నికలు వాయిదా వేయగానే జగన్ ఎదో జరిగినట్లు మాట్లాడుతున్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాసిన రాజ్యాంగ విరుద్దం. సిఎస్ రాసిన లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల అధికారికి సిఎం జగన్ క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో ఒక సారి ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన తరువాత ఇక ప్రభుత్వ పాత్ర ఉండదు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను ఎన్ఇసికి రాజ్యంగం కల్పించింది. సిఈసికి ఉన్న అధికారాలన్నీ ఎస్ఈసికి ఉన్నాయనీ సుప్రీం కోర్టే చెప్పింది.