(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైసిపి అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడితే ఉదాసీనంగా ఉండేది లేదన్న సంకేతాలు పార్టీ నాయకత్వం వైపు నుంచి వచ్చాయి. నెల్లూరు జిల్లా వైసిపి రాజకీయాలపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించిన మీదట ఈ సంకేతాలు వచ్చాయి. నెల్లూరు జిల్లాకే చెందిన టిడిపి నాయకుడు బీద మస్తాన్ రావు వైసిపిలో చేరిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. ఎవరూ గీత దాటవద్దని హెచ్చరిస్తున్నాం అన్నారు.
ఎలాంటి విషయమైనా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లాలి తప్ప మీడియా ముందుకు రాకూడదని ఆయన అన్నారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారైనా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నెల్లూరు వైసిపిలో విభేదాలు లేవని అన్నారు. అనం అలా ఎందుకు మాట్లాడారో తెలియదనీ, తమ పార్టీలో జగన్ ఒక్కరే నాయకులనీ అన్నారు.