‘రాజులనాటి వైభోగానికి సాక్ష్యాలుగా మిగిలింది రాళ్లూ రప్పలే’ అని ఓ సామెత ఉంది. తదనంతర కాలంలో ఇదే తరహాలో ఏలుబడి సాగించినవారు జమిందారులు. వీరి ఏలుబడికి సాక్ష్యాలుగా నిలిచింది కోటలు, పొలాలు, ఆస్తులు.. అంతకుమించి వారసత్వం. అటువంటీ ‘జమీ’నే విజయనగరం పూసపాటి గజపతుల వంశం. వారికున్న వేలాది ఎకరాలు, దేవాలయాలు, ఆస్తులు, ట్రస్టులు గురించి వారసుల గురించి ఆ ప్రాంతం వారికే ఎక్కువ తెలుసు. అయితే.. వారిమధ్యలోకి రాజకీయాలు తలదూర్చడంతో ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తోంది. మొన్నటివరకూ ఈ వంశంలో ఆధిపత్యపోరు మాత్రమే నడవగా.. ఇప్పుడు వారసత్వం వివాదం రేపుతోంది. అదే.. మన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ ‘సంచయిత’ జననం గురించి. ఆ కథ ఏమిటంటే..
సంచయిత గురించి వచ్చిన వార్త ఏంటంటే..
టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్న ఆనందగజపతి రాజు కుమార్తెగా మన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా బాధ్యత స్వీకరించారు సంచయిత. ‘స్వీకరించారు..’ అనేకంటే వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పాలి. అయితే.. సంచయిత ఆనంద గజపతిరాజు కుమార్తె కాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొత్తగా చెప్పారు. సంచయిత తల్లి ఉమా గజపతి ఆనంద గజపతికి చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి రమేశ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానమే సంచయిత. చట్ట ప్రకారం విడాకులు పొంది రమేశ్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆమెకు గజపతి జమీతో సంబంధం ఉండదు.. వీరద్దరికీ పుట్టిన సంతానానికి గజపతి వారసత్వమే ఉండదు కదా అనే రాజుగారి మాట. మరి.. వైసీపీ ప్రభుత్వం సంచయితను గజపతి వారసురాలిగా ఎలా గుర్తించారని ఇప్పుడు చర్చగా మారింది.
కుటుంబ వ్యవహారాల్లోకి రాజకీయ రంగు..
నిజానికి సంచయిత బీజేపీ నాయకురాలని అంటున్నారు. ఆమెను తెర మీదకు తెచ్చింది కూడా బీజేపీ కీలక నాయకుడని అంటున్నారు. టీడీపీ ఉన్నప్పుడు మన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతి రాజు ఉన్నారు. వైసీపీ వచ్చాక ఆ వంశానికి, జమీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆస్తులను చూసి ( ఓ ఉవాచ ) సంచయిత అసలు వారసురాలని చైర్ పర్సన్ ను చేసింది. మరి.. సంచయిత జననం గురించి తెలిసే ఇలా చేశారా.. తెలీక చేశారా అంటే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అన్నట్టు.. సంచయిత స్కూల్ రికార్డుల్లో తన తండ్రి పేరు ‘రమేశ్ శర్మ’గా రాసిందట..!