అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు కానీ రాళ్లు, చెప్పులు విసరడం సమంజం కాదని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు రాజధానిని శ్మశానంతో పోల్చడం సరికాదని ఆమె అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పురందేశ్వరి అన్నారు. రాజధానిపై నాన్చివేత ధోరణి, పోలవరంలో రివర్స్ టెండరింగ్ సరికాదని పురందేశ్వరి పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబుపై జరిగిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేయగా అదే పార్టీకి చెందిన మహిళా నేత పురందీశ్వరి ఆ చర్యలను తప్పుబట్టడం గమనార్హం.
నాడు రాష్ట్రాభివృద్ధికి రాజధానికి నిధులు ఇచ్చిన ప్రధాని మోది రాష్ట్రానికి వస్తే నల్లబెలూన్స్తో స్వాగతం పలికి చంద్రబాబు దుష్టబుద్ది చూపారని కన్నా విమర్శించారు. ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ’ అన్నట్లు పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతికి వెళ్లిన చంద్రబాబుకు చెప్పులతో స్వాగతం లభించిందని కన్నా వ్యాఖ్యానించారు.