అమరావతి, ఏప్రిల్ 19: టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 22వ తేదీన సమావేశం కానున్నారు. 23వ తేదీ నుండి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేపథ్యంలో ఒక రోజు ముందు అభ్యర్థులతో వివిధ అంశాలను చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా, జాతీయ సర్వేలు వైసిపికి అనుకూలంగా వెల్లడిస్తుండటం, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కూడా విజయంపై ధీమాగా ఉండటంతో మరో సారి అభ్యర్థులతో నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు పరిశీలనకు అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.
175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు 150 ప్లస్ అసెంబ్లీ స్థానాలు ఖాయమని చెప్పుకుంటూ వచ్చారు. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత 120నుండి 140 స్థానాలు ఖాయమని చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో నేతలతో చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి మరో నాలుగు వారాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.