AP Politics: గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందులో వారి రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై పార్ట్ – 1లో పది మంది నేతల పరిస్థితి చూశారు కదా. ఆ నియోజకవర్గాల్లో వారి పరిస్థితి ఎలా ఉంది. ఫేడ్ అవుట్ అయిపోయారా అనేది ఇప్పటికే తెలుసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 13 మంది నేతల రాజకీయ పరిస్థితి పార్ట్ – 2 లో ఇస్తున్నాము.
కర్నూలు జిల్లా భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ : నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ నుండి నాగిరెడ్డి భార్య మృతి చెందిన తరువాత అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలోనే కుమార్తెతో సహా టీడీపీ లో చేరారు. నాగిరెడ్డి మరణానంతరం నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు 2015లోనే టీడీపీలో చేరారు. భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ప్రోత్సహించారు. ప్రస్తుతం అఖిలప్రియ, బ్రాహ్మానందరెడ్డి లు యాక్టివ్ గానే ఉన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తునే ఉంది. * శ్రీశైలం నియోజకవర్గం బుద్దా రాజశేఖరరెడ్డి : బుద్దా రాజశేఖరరెడ్డి 2016 ఏప్రిల్ లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు. అంత యాక్టివ్ గా లేరు. ఆ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారని సమాచారం.
కర్నూలు ఎస్వీ మోహనరెడ్డి : కర్నూలు నుండి ఎమ్మెల్యే గా గెలిచి 2016లో టీడీపీలో చేరారు. కానీ 2019లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే 2014 ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి టిజీ వెంకటేశ్ పై కేవలం 3,500 మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో టీజీ కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు టిజి వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కు టికెట్ ఇవ్వడంతో ఎస్వీ మోహన్ రెడ్డి అలిగి ఎన్నికలకు నెల రోజుల ముందు మళ్లీ వైసీపీకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వైసీపీలోనూ ఆయన అంత యాక్టివ్ గా లేరు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఉన్నారు. 2016 లో పార్టీ మారకుండా ఉండి ఉంటే ఎస్వీ మోహన్ రెడ్డికి జగన్ 2019లో టికెట్ ఇచ్చే వారు, మరో సారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అన్నట్లుగా ఉంది.
గూడూరు నియోజకవర్గం పాశం సునీల్ కుమార్ : పాశం సునీల్ కుమార్ 2016లో టీడీపీలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చినా భారీ ఓట్ల తేడాతో (45వేల పైచిలుకు) ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఆయన అభ్యర్ధిత్వం ఖరారు చేయడం అనుమానాస్పదమేనని అంటున్నారు. పాశం సునీల్ కుమార్ రాజకీయ భవితవ్యం కూడా కష్టాల్లోకి వెళ్లినట్లే చెప్పుకోవచ్చు. * ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పోతుల రామారావు : పోతుల రామారావు 2016లో టీడీపీలో చేరారు. 2019 లో టీడీపీ టికెట్ ఇస్తే భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన గ్రానైట్ క్వారీలపై కేసులు పెట్టడంతో పాటు ఎన్నికలకు ముందు ఐటీ రైడ్స్ జరగడంతో ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్నది. వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడం తదితర కారణాల రీత్యా ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా తయారైంది.
యర్రగొండపాలెం నియోజకవర్గం డేవిడ్ రాజు : 2016 లో టీడీపీలో చేరారు. ఆ తరువాత యర్రగొండపాలెం అధికార పార్టీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు. ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు టికెట్ ఇవ్వకపోగా 2014 ఎన్నికల్లో ఆయనపై ఓడిపోయిన అజితారావుకే టీడీపీ ఇచ్చింది. ఈ పరిణామంతో అలిగిన డేవిడ్ రాజు 2019 ఎన్నికలకు 15 రోజుల ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడ ఆయనకు ఆ పార్టీలో ప్రెయారిటీ దక్కలేదు. దీంతో ఆరు నెలల క్రితం మళ్లీ టీడీపీలో చేరారు. రాజకీయంగా ఫేడ్ అవుట్ అయినట్లే కనబడుతోంది. * గిద్దలూరు నియోజకవర్గం అశోక్ రెడ్డి : 2016లో టీడీపీ లో చేరిన అశోక్ రెడ్డికి 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎమ్మెల్యేలలో రెండవ స్థానాన్ని కైవశం చేసుకున్నారు అశోక్ రెడ్డి. 81వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లోనూ అశోక్ రెడ్డి గెలుపు కష్టమే అని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నేత గెలవాలంటే వైసీపీ తరపునే పోటీ చేయాల్సి ఉంటుంది. ఈయన టీడీపీతో పోటీ చేయడంతో యాంటీ రెడ్డి ఓటింగ్ అశోక్ రెడ్డికి పడలేదు. ఎన్నికల నాటికి ఎంత కవర్ చేసుకున్నా 30 నుండి 35వేల వరకూ ఆయనకు మైనస్ ఉంటుందని అంటున్నారు. రాజకీయంగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నట్లే కనబడుతోంది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కలమట వెంకట్రావు : 2016 లో టీడీపీలో చేరారు. వివిధ రకాల కాంట్రాక్ట్ పనులు చేయడం ద్వారా ఆర్ధికంగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా అన్నది డౌటే. ఆ నియోజకవర్గంలో మామిడి గోవిందరావు యాక్టివ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో సీటు ఆశించిన మామిడి గోవిందరావు పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దీంతో రాజకీయంగా ఆయన ఫేడ్ అవుట్ అయినట్లు చెప్పుకోవచ్చు. * పాడేరు నియోజకవర్గం గిడ్డి ఈశ్వరి : 2014 లో వైసీపీ నుండి గెలిచిన గిడ్డి ఈశ్వరి 2017 నవంబర్ లో టీడీపీలో చేరారు. ఆమెకు 209 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వగా 50వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత పార్టీలో యాక్టివ్ గా లేరు. * బొబ్బిలి నియోజకవర్గం సుజయ కృష్ణరంగారావు : టీడీపీలో చేరిన సుజయ కృష్ణ రంగారావుకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి గా సైలెంట్ అయ్యారు. టీడీపీలో యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం బొబ్బిలికి బేబీ నాయక టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. బేబీ నాయన టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. సుజయ కృష్ణరంగారావు పరిస్థితి రాజకీయంగా ఇక కష్టమే అని చెెప్పుకోవచ్చు.
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ : గొ్ట్టిపాటి రవికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ నుండి గెలిచి పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రవికుమార్ రికార్డు సృష్టించారు.పార్టీ మారిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తరువాత ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావించి ప్రజల్లో ఉంటూ కార్యక్రమాలు చేశారు. వారం వారం రివ్యూ చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఎక్కువ శ్రద్ద పెట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలు అధికారం అనుభవిస్తూ రిలాక్స్ మూడ్ లో ఉంటే గొట్టిపాటి నియోజకవర్గంలో తిరుగుతూ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో చెప్పి కార్యక్రమాలు చేస్తుండటంతో సక్సెస్ అయ్యారు. గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల గొట్టిపాటి సక్సెస్ అయ్యారు. మిగిలిన వాళ్లు ఫెయిల్ అయ్యారు. జగన్మోహనరెడ్డి టార్గెట్ కు 22 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు బలి కాగా గొట్టిపాటి రవికుమార్ మాత్రం ప్రజల మద్దతుతో ఇంకా యాక్టివ్ గా ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?