AP Politics: మనమొక రాజకీయ వేదికకు కింద కూర్చుని పైకి చూస్తున్న ప్రేక్షకులం.. “ఎవరెప్పుడు ఏ వేషం వేసుకుని వస్తారో..? ఎవరెప్పుడు ఎలా నటిస్తారో..? ఎవరెప్పుడు ఎలా అరుస్తారో..? ఎవరెప్పుడు ఏ విధంగా ఏడుస్తారో..!? ఏం తెలియడం లేదు..! ఎవరు తన తల్లిని తిట్టారు మొర్రో అని మీడియా ముందు బిక్క మొహం పెట్టుకుని వాపోతారో..!? ఎవరెప్పుడు నా భార్యని అన్నారు బాబోయ్.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తారో..!? ఎవరెప్పుడు బూతులను ప్రయోగిస్తారో..? ఎవరెప్పుడు బెత్తం తీసి కొట్టేస్తారో..!? ఏం అర్ధం కావడం లేదు. ఈ వేదికపై వేడి వేడి పకోడీలు, జిలెబీలు, సమోసాలు అప్పుడప్పుడు వండి పంపిస్తున్నారు.. మనం తినేసి.. మళ్ళీ నెక్స్ట్ సీన్ ఏమిటా అని ఎదురు చూస్తున్నాం..!? అంతేగా ఏపీ రాజకీయమా..!?
AP Politics: ఓహో.. జనాలు చూసి ఓటేయాలా..!?
వేదికపై ఫ్యాక్షన్ సినిమాలు చూపిస్తారనుకున్న ప్రతీసారి సానుభూతి, సెంటిమెంట్ సీన్లు పండిస్తున్నారు. బాబాయ్ మర్డర్ కేసు తేల్చేస్తారులే.. ఇక ఫ్యాక్షన్ కథ ట్విస్టులు బాగుంటాయి అనుకున్న సమయానికి.. “అమ్మని తిట్టారు.. బోషిడీకె” అన్నారని దానికి లేని అర్ధాన్ని వెతికి పట్టుకొచ్చి బిక్కమొహమేసుకుని జనాల ముందు సానుభూతి డ్రామాలాడిన నాయకుడికి జనం జేజేలు పలుకుతున్న తరుణంలో…. ఇప్పుడు మరో ఆర్టిస్టు.. “భార్యని అన్నారు. నా భార్య ఎప్పుడు బయటకు రాలేదు. ఆమెను తిడుతున్నారు” అంటూ వెక్కి వెక్కి ఏడ్చి.., కన్నీళ్లు తుడిచేసి మళ్ళీ ఏడ్చేసి.. మళ్ళీ మళ్ళీ సీన్ పండించిన నాయకుడికి జేజేలు మొదలయ్యాయి. వాళ్ళ నాయకుడికి వాళ్ళు.., వీళ్ళ నాయకుడికి వీఏళ్లు జేజేలు, కేరింతలు, నాలుగు కన్నీటి బొట్లు.., పద్నాలుగు సానుభూతి పదాలు పెట్టుకుని ఆ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నారు. వేదికపై ఉన్న ఆ ఆర్టిస్టులకు ఈ కింద నుండి చూస్తున్న ప్రేక్షకుల చప్పట్లు కావాలి. చప్పట్ల వెనకున్న ఓట్లు కావాలి. బుద్ధి ఉండదు. ఉన్నా వాడరు. జనం ఏమనుకుంటారోనన్న సిగ్గు కూడా ఉండదు. వేదికపై ఉన్న అందరూ ఎవరి పాత్రలో వారు జీవిస్తున్నారు.. ఏమిటో.. ఈ ఏపీ రాజకీయ వేధిక..!
ఏపీ రాజకీయాన్ని నడిపిస్తున్నది ఏమిటి..!?
దేశం మొత్తం మీద ఏపీ రాజకీయమే ఇప్పుడు ఒకరకంగా హాట్ టాపిక్..! నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు రాజకీయ పతనంలో ఉన్నాడు. ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ అతనిది..! పాపం అధికార పార్టీ దూకుడుతో తట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్లు ఏడుపొక్కటే తక్కువ.., ఈరోజు అది కూడా వచ్చేసింది..! ఇక అప్పుడెప్పుడో తండ్రి చావుతో.. సీఎం కుర్చీ ఇవ్వలేదని.. పార్టీ పుట్టుకే సానుభూతి, సెంటిమెంట్, పోరాటం, కాంగ్రెస్ అనే భీకర శక్తిని ఎదిరిస్తూ ఎదిగిన పార్టీ జగన్ ది..! పదేళ్లుగా గెలుపు, ఓటములతో చివరికి 2019 నాటికి 151 స్థానాలతో గెలిచినా.. అతి విశ్వాసం ప్రదర్శిస్తున్న నేతలతో నలుగుతూన్న పార్టీ ఇది..! ఈ రెండు పార్టీల మధ్య బాబాయ్ మర్డర్ కేసు.., పార్టీ ఆఫీస్ పై దాడులు.., అమ్మకు తిట్లు, అసెంబ్లీలో హేళనలు, ఎన్నికల్లో మాయాజాలాలు, భార్యకు కూడా అపార్ధాలు.. అప్పుడప్పుడు ఓటుకి నోటు కేసు.., మంగళగిరిలో లోకేష్ ఓటమి వ్యవహారం.. అమరావతిలో అవినీతి.. మూడు రాజధానులు… కమ్మ మీడియా, ఎల్లో మీడియా.., బ్లూ మీడియా… అనే వ్యవహారాల చుట్టూ నలుగుతుంది. ఏపీలో రాజకీయాన్ని ఇవే నడిపిస్తున్నాయి. ఈ అంశాలే ఏపీలో రాజకీయాన్ని శాసిస్తున్నాయి. గత నెలలో “మా అమ్మని తిట్టారని సీఎం బిక్క మొహం వేసుకుని సానుభూతి రాజకీయానికి తెరతీస్తే.. ఈరోజు నా భార్యని తిట్టారు.. అని ఏకంగా కన్నీరే పెట్టుకుని ఏడ్చేసి.. సానుభూతి డ్రామాని పండించేసి తన సీనియారిటీని చాటుకున్న ఘనుడు చంద్రబాబు..! అందుకే.. “తల్లిని తిట్టారని బిక్క మొహాలు.. భార్యని అన్నారని వెక్కి ఏడుపులు..! ఇదేనా ఏపీ రాజకీయం”..!?