అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి నిద్రపట్టక ఫినాయిల్ రాతలు రాయించారనీ, తెలుగును రక్షించండి అంటూ గగ్గోలు పెట్టారనీ ఇప్పుడు అదే ఫినాయిల్ పత్రికలో పేద పిల్లలకు ఇంగ్లీషు వద్దా అని విరుచుకుపడుతున్నారనీ విమర్శించారు. డబుల్ స్టాండర్డ్స్ పక్కన పెట్టి ఒకే స్టాండ్ మీద నిలబడమని జగన్కు సలహా ఇవ్వాలని విజయసాయిరెడ్డికి బుద్దా సూచించారు.
‘దేవుడి స్క్రిప్టో లేక యాధృచ్ఛికంగా జరగుతాయో తెలియదు కానీ మీరు చేసిన తప్పులన్నింటికీ మీరే స్వయంగా ఒప్పుంకుంటారు. పంటలు తగలబెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రచ్చ చేసిన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. టైర్లు తగులబెట్టి కులల మధ్య చిచ్చుపెట్టిన సంఘటనలు గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీ ఆస్థాన విధ్వాంసులను ప్రయోగించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మీ ఫినాయిల్ పత్రిక, టివి చేసిన విధ్వంసం మర్చిపోతే ఎలా’ అంటూ విజయసాయిపై బుద్దా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘151 సీట్లు గెలిచి మెడలు వంచి దండాలు పెడుతున్నా 16 నెలల జైలు చరిత్ర చూసి ప్రధాని మోది దగ్గర నుండి అమిత్షా వరకూ మిమ్మల్ని, మీ ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఇష్టపడటం లేదు అనేది జగమెరిగిన సత్యమేగా సాయిరెడ్డి గారూ’ అంటూ బుద్దా ట్వీట్ చేశారు. లోపల చివాట్లు తిన్నా బయటకు వచ్చి వారి వెనుకే నడుస్తూ ఫోటో రావాలని తను చేసే ప్రయత్నానికి అయినా అవార్డు ఇవ్వాలని బుద్దా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.