Ap Politics ముత్యాలముగ్గు సినిమాలో విలన్ రావుగోపాల రావును ప్రతి ఒక్కరూ పొగుడుతూనే ఉంటారు. పొగడ్తలకు పడిపోకుండా అప్రమత్తంగా ఉండేందుకు తనతో ఓ భజన బృందాన్ని పెట్టుకుంటాడు రావుగోపాల రావు. ఎవరైనా ఆయన్ను పొగిడుతూంటే భజన బృందం డప్పు వాయిస్తూంటుంది. దీంతో పొగిడేవారు కూడా అక్కడితో ఆగిపోత ఉంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఆ సినిమాలో ఆయన్ను ఒకరు పొగడాలి. కానీ.. నేటి రోజుల్లో ఎవరికి వారే గొప్పలు, సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏపీ రాజకీయ పార్టీలు తీరు ఇలానే అనిపిస్తోంది. పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలు కాబట్టి.. తాము బలపరచిన అభ్యర్ధులే గెలిచారని చెప్పుకోవడానికి వారు పడుతున్న తాపత్రయం తీరు చూస్తుంటే.. వారి వెనుక ఓ భజన బృందం ఉండుంటే బాగుండని అనిపించకమానదు.
Ap Politics : టీడీపీ సొంత భజన..
‘పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది.. వైసీపీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైంది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం సీట్లు వచ్చాయని ప్రకటించుకున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సొంత పార్టీ వారికే విసుగు తెప్పించేవారో ఇప్పుడూ అదే చేస్తున్నారు. ప్రతిరోజు ఈ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ.. పంచాయతీల్లో ఆయన ప్రకటించిన సీట్లు అయితే రాలేదని చెప్పాలి. పార్టీ గుర్తులు లేకపోవడంతో గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పాలి. గెలిచిన చోట తమదే ఆధిపత్యం అంటూ.. ఓడిన చోట అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని.. అధికారులు ఫలితాలు తారుమారు చేస్తున్నారని అంటున్నారు. మీడియా సపోర్ట్ కూడా దండిగా ఉండడంతో ఈనాడు వంటి పత్రిక కూడా మొదటి దశ ఫలితాలను.. పార్టీ ఆఫీసులో చంద్రబాబు చెప్పిన లెక్కలే వేసి టీడీపీ ఆధిపత్యం అన్నట్టు ప్రింట్ వేయడం ఎవరికీ అర్ధం కాని విషయం. ఈ సమయంలో చంద్రబాబు చెప్తున్న మార్పు ప్రజల్లో వచ్చిందని ఎలా నమ్మేది..?
వైసీపీ సొంత భజన..
‘టీడీపీ పార్టీకి పునాదులు కదులుతున్నాయి.. ఇక పార్టీ కనుమరుగు కావడం ఖాయం’.. ఇదీ వైసీపీ మాట. సీఎం జగన్ రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న లెక్కల ప్రకారం.. తొలి దశ, రెండో దశలోనూ కూడా 80 శాతం స్థానాలు వైసీపీకే దక్కాయని చెప్తున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరిగే టైమ్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే పంచాయతీలు ఎక్కువ వస్తాయి. ఏకగ్రీవాలు కూడా వస్తాయి. అయితే.. ఈసారి పంచాయతీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడంతో పోటీ ఎక్కువైంది. చంద్రబాబు మ్యానిఫెస్టో విడుదల చేయడం, వైసీపీపై విమర్శలు చేయడంతో సజ్జల కూడా తమ లెక్కలు చూపిస్తున్నారు. అయితే.. కొంచెం వాస్తవికతకు దూరంగానే లెక్కలు ఉంటున్నాయి. వైసీపీకే మెజారిటీ స్థానాలు వస్తున్నాయనేది వాస్తవం. అయితే.. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా సత్యదూరానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవాలపై సీఎం జగన్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా.. ఓటింగ్ లో వైసీపీకి అనుకూలంగా రావడం వారికి ఊరటనిస్తోంది.
జనసేన బెటరే కానీ..
రెండు బలమైన పార్టీల మధ్య పవన్ కల్యాణ్ జనసేన తన ఉనికిని చాటుకుందనే చెప్పాలి. మొదటి, రెండో దశలో కలిపి 17 శాతం గెలుపు సాధించామని జనసేన అధినేత చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న జనసేనకు పంచాయతీలు దక్కడం విశేషమే. అయితే.. వచ్చిన చిక్కల్లా వైసీపీ, టీడీపీ, జనసేన తాము గెలుచుకున్న ఓటింగ్ శాతాన్ని చెప్పుకుంటుంటే.. మొత్తంగా 100 శాతం రావాల్సింది.. 137 శాతం వస్తోంది. ఇక్కడే ఈ పార్టీల లెక్కలు అర్ధం కావడం లేదు. ఇలా ఎవరికి వారు చెప్పుకుంటున్న లెక్కలు.. ముత్యాలముగ్గు సినిమాను గుర్తు చేస్తున్నాయి కాబట్టే ఈ మూడు పార్టీలకు భజన బృందం ఒకటి ఉంటే బాగుండును అని ఉదహరించాల్సి వస్తోంది. అయితే.. వీరిలో ఎవరి సత్తా ఏంటో మరికొన్ని రోజుల్లో తేలనుంది. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఆపై ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేన.. పార్టీల బలమెంతో.. పంచాయతీ ఎన్నికల్లో వారు కొట్టిన డప్పు సంగతేంటో తేలిపోవడం ఖాయం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?