AP Politics: గన్నవరంలో వంశీని ఓడించాలి.. కచ్చితంగా అతన్ని మళ్ళీ గెలవకుండా చేయాలనేది టీడీపీ వ్యూహం.. గన్నవరంలో పార్టీలో చేరిన వంశీని సరిగ్గా వాడుకోవాలి.. అలా అని ముందు నుండి పార్టీలో ఉన్న వెంకట్రావుకి, రామచంద్రరావుకు నష్టం రాకూడదు.. అనేది వైసీపీ లక్ష్యం..! అందుకే గన్నవరం, వల్లభనేని వంశీ టార్గెట్ గా రెండు పార్టీల్లో రెండు రకాల ఆలోచనలు చక్కర్లు కొడుతున్నాయి..! “ఒక నాయకుడు పార్టీ వదిలివెళ్లిపోతే ఆ నాయకుడి స్థానంలో మరొక నాయకుడిని తయారు చేసుకోవడం, లేదా కొత్త నాయకుడిని రీప్లేస్ చేసుకోవడం మాకు అంత కష్టమేమి కాదు” అని టీడీపీ అధినేత చంద్రబాబు తరచు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు, అభ్యర్ధుల మార్పులు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ పార్టీ మారిన తరువాత ఆయన నియోజకవర్గంలో ఎవరిని ఇన్ చార్జిగా పెట్టాలి..? అన్న చర్చకు వచ్చినప్పుడు బచ్చుల అర్జునుడుని తాత్కాలికంగా పెట్టారు. కాకపోతే గన్నవరంలో దూకుడు స్వభావం ఉన్న నాయకుడు కావాలి. కార్యకర్తలకు కష్టం వస్తే వెంటనే వెళ్ల గలితే దూకుడు నేత ఉండాలి. నియోజకవర్గంలో పరిచయాలు ఉండాలి. సొంత వర్గాన్ని తయారు చేసుకునే సమర్ధత ఉండాలి. అర్జునుడు సౌమ్యుడుగా పేరున్నప్పటికీ దూకుడు స్వభావం లేదు. ఆ నియోజకవర్గానికి ఎటువంటి అభ్యర్ధి కావాలో అటువంటి అభ్యర్ధి అర్జునుడు కాదు. అందుకే ఇప్పుడు టీడీపీ ఏమి చేస్తోంది అంటే గన్నవరంతో పాటు విజయవాడ తూర్పుతో పాటు మూడు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను వ్యూహాత్మకంగా మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తోంది టీడీపీ.
AP Politics: గద్దె అటు.. వంగవీటి ఇటు..!?
గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీలో మంచి పట్టు ఉన్న నేత. 2019లో ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా విజయవాడ తూర్పు నుండి మంచి మెజార్టీతో గెలిచారు. వంగవీటి రాధ 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి కారణం ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గఎం ఇవ్వకపోవడమే.. గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గమే కావాలని ఆయన పట్టుబట్టి ఉన్నారు. రాబోయే ఎన్నికలకు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వంగవీటి రాధాకు అప్పజెప్పి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ను గన్నవరం పంపాలి అనేది ఒక ఆలోచన. దీని వల్ల నష్టాలు, లాభాలను పరిశీలిస్తే….గన్నవరంలో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన స్వగ్రామం కూడా గన్నవరం పక్కనే ఉన్న అల్లాపురం. ఆయనకు అక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయి. ఆయన సామాజికవర్గ ఓట్లు బలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో గద్దె రామ్మోహన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గన్నవరంలో వల్లభనేని వంశీకి ధీటైన అభ్యర్ధిగా గద్దె రామ్మోహన్ ఉంటారనేది ఆ పార్టీ భావన. దీంతో గన్నవరం ఒక విధంగా సెట్ అయినట్లే చెప్పుకోవచ్చు. గద్దె రామ్మోహన్ కు ఇన్ చార్జి ఇవ్వడం వల్ల ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. విజయవాడ తూర్పు విషయానికి వస్తే ఇక్కడ వంగవీటి రాధ ఎమ్మెల్యేగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. 2009లో పోటీ చేయలేదు. దీంతో ఇక్కడ పీఆర్పీ గెలిచింది. 2014లో వంగవీటి రాధా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అప్పటికే టీడీపీ గద్దె రామ్మోహన్ కు టికెట్ కన్ఫర్మ్ చేసి ఉండటంతో రాధా పోటీ చేయలేదు. ఇప్పుడు వంగవీటి రాధా నియోజకవర్గ విజయవాడ తూర్పును టీడీపీ ఆయనకే ఇన్ చార్జిగా ఇచ్చేస్తోంది. ఇక్కడ దేవినేని అవినాష్ కు వైసీపీ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం.
వైసీపీలో వంశీని ఎంపీగా..!?
మరోవైపు వల్లభనేని వంశీకి గన్నవరం సీటు ఇస్తారో..!? లేదో కూడా అనుమానమే. ఎందుకంటే గన్నవరంలో ఇప్పటికే 2014లో పోటీ చేసి ఓడిపోయినా దుట్టా రామచంద్రరావు అల్లుడు భరత్ టికెట్ ఆశిస్తున్నారు.. 2019లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దర్నీ కాదని గన్నవరం సీటుని టీడీపీ నుండి వచ్చిన వంశీకి ఇస్తే జగన్ పట్ల నమ్మకం వమ్మవుతోంది. ఆ నియోజకవర్గంలో వైసీపీ బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే వెంకట్రావుకి గన్నవరం ఎమ్మెల్యే సీటు ఇచ్చి.., వంశీని విజయవాడ ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుంది అనేది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. వైసీపీకి ప్రస్తుతం విజయవాడ ఎంపీ అభ్యర్థి లేరు. 2019లో పోటీ చేసి ఓడిపోయినా పీవీపీ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఆయన మళ్ళీ వైసీపీ తరపున తిరగడం లేదు, కనీసం జగన్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. అందుకే 2009 ఎన్నికల్లో ఆల్రెడీ విజయవాడ ఎంపీగా పోటీ చేసిన అనుభవమున్న వంశీని ఆ ప్రాంతం నుండి పోటీ చేయిస్తే బాగుంటుంది అని జగన్ భావిస్తున్నారట.. మొత్తానికి ఈ మార్పులు రెండు పార్టీల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి..!