(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పలు పరిణామాలు చూస్తుంటే “వో వాట్ ఏ కో ఇన్సిడెంట్” అనక తప్పదు. ప్రధానంగా ఇటీవల విశాఖలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు విమానాశ్రయం నుండే, వెనక్కు పంపడం, నిన్న పల్నాడు ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై దాడి ఘటనలు చూసుకున్నట్లయితే ఇదే తరహా ఘటనలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరగడం గమనార్హం. నాడు జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను నేడు అధికార పక్షం కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఒక చెంపు మీద కొడితే రెండవ చెంప చూపే గాంధేయవాదులు నేటి సమాజంలో బూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనబడరు అనేది వాస్తవం. ప్రస్తుతం దాడికి ప్రతి దాడి, సవాల్కు ప్రతి సవాల్, వ్యూహానికి ప్రతివ్యూహం, కేసుకు కౌంటర్ కేసు ఇలా రాజకీయం నడుస్తోంది.
ఇటీవల ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రకు బయలు దేరిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయన్న కారణంతో విశాఖ ఎయిర్ పోర్టు నుండే పోలీసులు వెనక్కు పంపిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ వెళితే బిజినెస్ సమ్మిట్ జరుగుతోందన్న సాకుగా చూపి ఆయనను ఎయిర్ పోర్టు నుండి వెనక్కు పంపలేదా అని నేటి అధికార వైసిపి నేతలు ప్రశ్నించారు. నాడు ప్రతిపక్ష నేత జగన్కు విశాఖలో పరాభవం ఎదురవ్వగా నేడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకూ అక్కడ పరాభవం తప్పలేదు.
అదే మారిదిగా నిన్న పల్నాడులోనూ యాదృశ్చికంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై జరిగిన దాడికి కూడా గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన దాడిని నేటి అధికార పక్ష నేతలు తెరపైకి తీసుకురావడం గమనార్హం. నిన్న మాచర్లలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కారుపై అదికార పక్షానికి చెందిన కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బొండా ఉమా, బుద్దా వెంకన్న స్వల్పంగా గాయపడగా, వారితో ఉన్న హైకోర్టు న్యాయవాది కిషోర్కు బలమైన గాయం అయ్యింది. రాజకీయ కారణంతోనే తమపై దాడి చేశారనీ బుద్దా వెంకన్న, బొండా ఉమాలు ఆరోపిస్తుండగా ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వ ఆరాచకత్వం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ డిజిపి కార్యాలయం వద్ద ధర్నాకూ దిగారు.
అయితే టిడిపి నేతల ఆరోపణలను వైసిపి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండిస్తున్నారు. మాచర్లలో ఓ చిన్న పిల్లవాడిని టిడిపి నేతలు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడం వల్ల స్థానికులు, ఆ పిల్లవాడి బంధువులు ఆగ్రహంతో వారిపై దాడి చేశారే తప్ప వేరే కారణాలు లేవంటూ కొట్టిపారేశారు. 2014లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల సమయంలో వైసిపి నేతలు అంబటి అంబటి రాంబాబు, ముస్తఫాఫై టిడిపి శ్రేణులు దాడులకు తెగబడి ఎంపిటిసిని కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు.
నిన్న పల్నాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను టిడిపి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, టిడిపి హయాంలో వైసిపి నేతలపై జరిగిన దాడి వీడియోను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనపై సానుభూతి పొంది అధికార పార్టీపై దుమ్మెత్తిపోయాలని భావిస్తున్న తెలుగుతమ్ముళ్లకు నాటి వీడియో కూడా వైరల్ కావడంతో “నీరు నేర్పిన విద్యయే నీరజాక్ష” అన్నట్లు ఉందని సామాన్యులు పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?