అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్గా నియమించింది. చైర్మన్ పదవికి నిన్ననే రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ పంపారు.
కారెం శివాజీ ఇటీవల టిడిపి అధిష్టాన వైఖరికి భిన్నంగా ఇంగ్లీషు మాద్యమంపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కారెం శివాజీ వ్యాఖ్యానించారు. దీన్ని రాజకీయ కోణంలో చూసి రాద్ధాంతం చేయడం మానుకోవాలని కూడా పరోక్షంగా టిడిపికి హితవు పలికారు. దీన్ని వ్యతిరేకించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా ఆయన అన్నారు. కారెం శివాజీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ పదవిని కాపాడుకునేందుకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారని భావించారు. సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రభుత్వానికి అనుకూలంగా ఇంగ్లీషు మాధ్యమం విషయంలో వ్యాఖ్యలు చేసిన కారెం శివాజీ శుక్రవారం వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. అరకు ఎంపి మాధవి ఆధ్వర్యంలో కారెం శివాజీతో పాటు పలువురు వైసిపిలో చేరగా జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.