(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు టిడిఎల్పి లేఖ రాసింది.
సభల నిర్వహణలో బిఏసి అజెండాను ఉల్లగించారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారన్నారు. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బిఏసిలో నిర్ణయించి మరీ మరో మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించారని లేఖలో పేర్కొన్నారు.
శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమన్న విషయాన్ని టిడిఎల్పి గుర్తు చేసింది. కౌన్సిల్లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ చర్చలో పాల్గొనకూడదనే సభను బాయ్కాట్ చేశామని టిడిఎల్పి స్పష్టం చేసింది.