ఏపీ టీడీపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంచి దూకుడు మీద ఉన్నారు. ఇటీవల పార్టీ నేతలతో జూమ్ సమావేశాలలో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పుడు కేసులు ఆర్థిక మూలాలపై దెబ్బతీయటం వంటి చర్యలతో పార్టీ కీలక నాయకులలో కొంత భయం ఏర్పడిన మాట వాస్తవం అని చెప్పుకొచ్చారు. వారు సైలెంట్ అవటంవల్ల పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురి అయిందని.. ఆ స్తబ్దత పోగొట్టడానికి తాను రంగంలోకి దిగబోతున్నాట్లు స్పష్టం చేశారు.
ఒక్కసారి రోడ్డుపైకి నాయకులు వచ్చి నిలబడితే వారి వెనకాల క్యాడర్ నిలబడటం గ్యారెంటీ అని తెలిపారు. ప్రజలలో రాజకీయపరంగా వస్తున్న మార్పు కూడా నేతల్లో భయాని తగ్గిస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో మూడు రాజధానులు గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి అప్పుడు ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ ఎన్నికలను మూడు రాజధానులకి రెఫరెండం గా తీసుకోవాలని సూచించారు. మూడు రాజధానులు పై తీర్పు కోరుతూ ఉత్తరాంధ్ర లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారో దాన్నిబట్టి పోరాటం విరమించాలని… కోరుతూ జరిగిన సమావేశంలో అచ్చెన్నాయుడు దూకుడుగా వ్యవహరించినట్లు ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వస్తున్నాయి.