Ap-Telangana: ఏపీ-తెలంగాణ Ap-Telangana మధ్య ప్రాంతీయ సమస్యలు ఎప్పుడో తొలగిపోయాయి.. రాజకీయాల్ని మినహాయిస్తే..! అయితే.. ఇప్పుడు కొత్తగా సరిహద్దు సమస్య తలెత్తింది. అది కూడా ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో ఏపీ ఆంబులెన్సులను తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశం అడ్డుకోవడం ద్వారా. తెలంగాణ హైకోర్టు కొద్ది రోజుల క్రితమే దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పోలీసులకు ఏం హక్కు ఉంది? ఆంబులెన్సులను అడ్డుకోవడానికి.. అంటూ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. అయినా.. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేశాక కొత్త నిబంధనల ప్రకారం మళ్లీ అడ్డుకుంటున్నారు. దీంతో మళ్లీ ఈ అంశం తీవ్ర వివాదం రేపుతోంది. మళ్లీ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ ఆంబులెన్సులను అనుమతిస్తున్నారు.
ఆంబులెన్సులు ఆపొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. కొత్త సర్క్యులర్ లో హైకోర్టు ఆదేశాల్ని మినహాయించకపోవడం.. మళ్లీ హైకోర్టుతో చీవాట్లు తినే పరిస్థితి తెచ్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా ఏపీ బీజేపీ, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మానవతా దృక్పథంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించాలని లోకేశ్ అన్నారు. కానీ.. టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వ చర్యలను ఖండించింది లేదు. ఓటుకు నోటు కేసు వివాదం ఉన్న నేపథ్యంలో ఇలా ఆలోచించి ఉండొచ్చు. కానీ.. ప్రజల సమస్యలపై పక్క రాష్ట్రం అవలంబిస్తున్న తీరుపై జాతీయపార్టీ అధ్యక్షుడిగా.. తెలంగాణలో కూడా పార్టీ ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే.
తెలుగు ప్రజలు అని ఏపీ నాయకులు అనటమే కానీ.. తెలంగాణ నాయకులు దాదాపుగా అన్నది లేదు. ఎన్నికల్లో ఓట్లు.. భీమవరం ప్రజలు, తెలుగు రాష్ట్ర సమితి అనే డైలాగులకు కొదవుండదు. వీటికి చప్పట్లు కొట్టి ఇప్పటి పరిస్థితిని చూస్తున్న ఏపీ ప్రజలే సిగ్గుపడాలి. ఉమ్మడి ఏపీ హక్కు ఇంకా మూడేళ్లున్నా తెలంగాణ ప్రభుత్వ చర్యను ప్రశ్నించలేని రాజకీయ అసమర్ధతకు సిగ్గుపడాల్సిందే. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో లేని సమస్య తెలంగాణలో మాత్రమే వచ్చిందంటే ఇది రాజకీయమనే చెప్పాలి. ఈ సమస్యలు ఊహించే నాడు ఏపీని యూటీ చేయాలని చిరంజీవి అన్నప్పుడు విమర్శించారు. చిరంజీవి మాటల్ని పట్టించుకుని కాంగ్రెస్ ఆనాడు మరోలా ఆలోచించి ఉంటే నేడు ఏపీ ప్రజలకు ఈ సమస్య ఉండేది కాదనే చెప్పాలి.