అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ చూపిన దారిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ముందుగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ వర్కింగ్ కమిటీ ఇంత వరకూ రాహుల్ రాజీనామాను ఆమోదించలేదు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీనే అధ్యక్షుడుగా కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యనేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామా సమర్పించగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు రఘువీరా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం రఘువీరా రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం.