ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక వినూత్న పథకాలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఎన్నో పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. వాటిలో కేంద్రం తీసుకొచ్చిన కొన్ని.. నిర్మల్ భారత్ అభియాన్ పథకం, జన్ధన్ యోజన పథకం, రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ), ప్రధానమంత్రి సడక్ యోజన (పి. యం. జి. యస్. వై), సబల రాజీవ్ గాందీ గ్రామీణ (కిశోర) బాలికల సాధికారికత పథకం.
కాగా, యువత కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చాయి. అమ్మాయిల కోసం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కోసం బంగారు తల్లి పథకం, సబల రాజీవ్ గాందీ గ్రామీణ (కిశోర) బాలికల సాధికారికత పథకం, సుకన్య సమృద్ధి యోజన వంటి చాలా పథకాలే ఉన్నాయి. తాజాగా అమ్మాయిల కోసం ఓ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం గురించి తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే. అలాంటి అదరిపోయే పథకం మరి అది.
అంతలా చెబుతున్న ఆ పథకం ఏమనుకుంటున్నారా? ఉచితంగా బంగారం అందించే పథకం అవును మీరు విన్నది నిజమే. అమ్మాయిలకు ఉచితంగా తులం (10 గ్రాముల) బంగారం అందించే పథకాన్ని తీసుకొచ్చింది అసోం ప్రభుత్వం. ఈశాన్య రాష్ట్రం అమలు చేస్తున్న ఈ వినూత్న పథకం పేరు అరుంధతీ గోల్డ్ స్కీమ్. ఈ పథకం కింద పెళ్లి చేసుకోబోయే యువతులకు ప్రభుత్వం పది గ్రాముల (తులం) బంగారం ఉచితంగా అందిస్తుంది.
ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే.. అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. సదరు యువతి కుటుంబం సంవత్సర ఆదాయం ఐదు లక్షల రూపాలయ లోపు ఉండటంతో పాటు.. పెళ్లిని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత పెళ్లి ఫొటోలను, పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పిస్తే.. ఈ ప్రయోజనాలు అందుతాయి. అమ్మాయితో పాటు అబ్బాయి వయస్సు సైతం 21 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి. యవస్సు రాకముందే చేసే పెళ్లిళ్లు ఈ పథకం వల్ల తగ్గే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాలు అమ్మాయిల పెళ్లి కోసం నగదు అందిస్తున్నాయి. అయితే, పెళ్లికి నగదు కంటే బంగారం అందించడం మంచిదని ప్రజలు అనుకుంటున్నారు.