మాజీ మంత్రి కేఎస్. జవహర్ను టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నిజానికి ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉంది. నేతలు ఆయనపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎంతో మంది సీనియర్లు, పార్టీ కోసం ఏళ్లతరబడి పనిచేసిన వారిని పక్కన పెట్టి.. జవహర్కు ఇంతటి కీలక అవకాశం ఎందుకు ఇచ్చారని.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ఆఫ్ది రికార్డుగా అధిష్టానానికి ప్రశ్నలు సంధించారు. ఈ బాటలోనే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు జవహర్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సరే..! ఇప్పుడు ఆయనను ఎలాగూ నియమించేశారు. చేసేది ఏమీ లేదు. ఆయన చెప్పింది వినడం, చేయమంది చేయడమే ఇప్పుడు నేతల ముందున్న మార్గం. మరి జవహర్ మాట వింటారా? ఆయన సూచనలు, సలహాలు పాటిస్తారా? గత ఎన్నికల అనంతరం తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నేతలను జవహర్ లైన్లోకి తెస్తారా? పార్టీ పుంజుకునేలా వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు నియోజకవర్గం టీడీపీ నేతల్లో వినిపిస్తున్నాయి.
తాజాగా జవహర్ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైరెండు రోజులు కసరత్తు చేశారు. ఎవరికి ఆహ్వానాలు పంపాలో వారందరికీ ఆహ్వానాలు పంపారు. అజెండా సిద్ధం చేసుకున్నారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇల్లే వేదికగా ఈ సమావేశం నిర్వహించారు. మరి జవహర్ ఇచ్చిన పిలుపుతో ఎంతమంది నాయకులు ఈ సమావేశానికి వచ్చారు? ఎవరెవరు ఆయనతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు? అంటే.. వేళ్ల మీద లెక్కించుకునే రేంజ్లోనేసాగింది. దాదాపు అరగంటకు పైగా నాయకుల రాకకోసం.. జవహర్ ఎదురు చూశారు.
అయినప్పటికీ కీలకమైన నాయకులు ఎవరూ రాలేదు. దీంతో కంటితుడుపుగా కార్యక్రమం నిర్వహించారు. దీంతో జవహర్ సత్తా ఏంటో తెలిసిపోయిందనే వ్యాఖ్యలు తూర్పులో బాగానే వినిపిస్తున్నాయి. ఫస్ట్ మీటింగ్కే ఎవరూ రాకపోతే.. మున్ముందు ఆయన మాటలను ఎంత మంది పట్టించుకుంటారు? ఎంత మంది ఆయన బాటలో నడుస్తారో..? అర్ధం కావడం లేదా? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సో.. మొత్తానికి ఇప్పుడు జవహర్ సత్తా తెలిసింది. అయితే, ఇదే విధంగా ముందు రోజులు ఉండాలని లేదు కానీ.. ప్రస్తుతం అయితే.. జవహర్ ముందు నేతలను తనవైపు తిప్పుకొనేవ్యూహం ఉండాలనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో ? చూడాలి.