గెలిచింది 23 … మిగిలింది 20 .., గోడపై ఉన్నది 3 … సైలెంటుగా/ బలవంతంగా ఉన్నది 3 ..! ఇదీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల లెక్క…!! దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి, రాష్ట్రంలో 40 శాతం కచ్చితమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి ఈ లెక్కలు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే అర్జంటుగా పార్టీకి, కార్యకర్తలకు జోష్ నింపే గుళిక వేయాలి..!! ఆ గుళిక పేరు అచ్చెన్నాయుడు. అవునా..? ఆ గుళిక అంత ప్రాధాన్యమా..? అంతగా పని చేస్తుందా? అనేది చూద్దాం..!!
ఎవరేమనుకున్నా.. ఇవి టీడీపీకి బ్యాడ్ డేస్. పార్టీ పతనానికి అనలేం కానీ, వెనక్కు వెళ్తున్న రోజులు అని మాత్రం చెప్పుకోవాల్సిందే. ఒక రకంగా ఇవి పార్టీకి సచ్చేదిన్ అన్నమాట. జగన్ దూకుడు.., వైసీపీ వ్యవహారం.., ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే సొంతవారికే పార్టీ భవిష్యత్తుపై బెంగ కలుగుతుంది. 2024 నాటికి జగన్ పై జనాలకు అసంతృప్తి వస్తే… అప్పుడు దాన్ని నెట్టుకురావడానికి అయినా టీడీపీ పూర్తిస్థాయిలో ఉండాలి అనేది కార్యకర్తలు, నాయకుల కోరిక. కానీ జగన్ అనే సీఎం ఇంతలా టీడీపీని ఇబ్బంది పెడతాడు అనీ, ఎమ్మెల్యేలను లాగేస్తాడు అని కలలో కూడా ఊహించలేదు. జగన్ పై, జగన్ కి ప్రతిపక్ష పాత్ర ఇంత క్లిష్టంగా ఉంటుందా అన్నట్టు చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే టీడీపీకి చంద్రబాబు తర్వాత అంతగా మాట్లాడి, ఒకరకంగా చంద్రబాబు కంటే బాగా మాట్లాడి జగన్ ని కొంత ఇరుకున పెడుతున్న నాయకుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే అచ్చెన్నాయుడు. నిజానికి టీడీపీలో వాగ్ధాటి ఉన్న నాయకులకు కొదవ లేదు. కానీ జగన్ ని చూసి చాలా మంది పెద్దగా మాట్లాడడం లేదు. ఏఏ పరిస్థితుల్లో కూడా జగన్ ని ఎదిరించి మాట్లాడుతూ, సై అంటున్నది అచ్చెన్నాయుడు మాత్రమే. అందుకే టీడీపీకి ఆయన ఓ గుళిక. ఆ గుళికని బాగా వాడుకుని పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేసెయ్యాలి అనేది టీడీపీ తాజా ఆలోచన.
మంచి పేరుంది.. పార్టీలో పట్టుంది కానీ…!
అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడుకి రాజకీయం వారసుడు. స్వయానా తమ్ముడు. అన్న ఉన్నప్పుడు అన్నచెట్టు తమ్ముడిగా ఉండేవారు. అన్న చనిపోయిన తర్వాత కీలకమయ్యారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి మంచి నాయకుడిగా మారారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీకి కీలకమే. ఈయన సోదరి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఎర్రన్న కుటుంబానికి టీడీపీలో, రాష్ట్రంలో ఓ స్థాయి ఉంది. ఆ స్థాయిని, పేరుని అచ్చెన్నాయుడు మరింత పెంచే ప్రయత్నం చేశారు, సఫలమయ్యారు. అందుకే ఆయన టీడీపీకి ఇప్పుడు వెన్నెముకగా మారారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చంద్రబాబు తర్వాత ఆయనే అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. నమ్మకంగా ఉంటున్నారు. ఆయనకీ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందరూ అంగీకరిస్తారు.. కానీ ఏఏ మూళ్ళ కిరీటం స్వీకరించడానికి అచ్చెన్న ఎంతవరకు సిద్ధం అనేదే ప్రశ్న.
మళ్లీ అదే జిల్లాకా…??
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రస్తుతం కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత. మళ్లీ ఇప్పుడు అనుకుంటున్న అచ్చెన్న కూడా అదే జిల్లా. వరుసగా ఆ జిల్లా నాయకులకే ఇవ్వడం ఏమిటి..? అనే వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కానీ మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ సమయంలో ఈ బాధ్యతలు స్వీకరించడానికి కూడా ఎవరూ సాహసించకపోవచ్చు. ఆ స్థాయి ఉన్న నాయకుల జాబితాలో పరిటాల సునీత, దేవినేని ఉమా వంటి నేతలు ఉన్నప్పటికీ (చంద్రబాబు సామజిక వర్గం కాబట్టి ఇవ్వరు)..! విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు.., తూర్పు గోదావరికి చెందిన చినరాజప్పకు అవకాశాలు ఉన్నాయి. అయితే పార్టీ యోచన, ఉద్దేశాలు, అవసరాలు, అభిప్రాయాలు అనుగుణంగా ఈ మార్పు ఉంటుంది. ఏదైనా ఈ మూళ్ళ కిరీటం ధరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది టీడీపీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ…!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?