ESI కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసు వ్యవహారం రోజురోజుకీ బలపడుతోంది. విజిలెన్స్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించడంతో పాటు స్పష్టంగా కుంభకోణం జరిగినట్లు ఆధారాలు ఉండటంతో ఈ కేసులో అచ్చెన్నాయుడుకి బెయిలు రావడం కష్టమే అని న్యాయ నిపుణులు అంటున్నారు. కేసులో ప్రధాన ముద్దాయిగా అచ్చెన్నాయుడు ఉండటంతో బలమైన సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉండటం తో అచ్చెన్నాయుడు ఇక ఈ కేసులో ఇరుక్కుపోయినట్లే అనే వార్తలు బయటకు వస్తున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2016వ సంవత్సరంలో అక్రమాలు చేసి అనుభవం లేని పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాధారాలు ఉండటంతో ఈ కేసు ఉన్న కొద్దీ బలపడుతుందని సమాచారం. ఇటీవల అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ హోల్డ్ లో పెట్టింది. దీంతో అచ్చెన్నాయుడుకి ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమేనని ఈ కేసు విషయమై న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.