గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్పి రాజశేఖర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ రోజున స్పీకర్ కోడెల శివప్రసాద్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అంబటి రాంబాబు సహా మరో ఇద్దరు వైసిపి నేతలు, సుమారు 30 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి నేతలు బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్ తదితరులు ఎస్పిని కలిశారు.
అనంతరం బొత్సా మీడియాతో మాట్లాడారు. కోడెల ఒత్తిడితోనే వైసిపి నేతలపై కేసులు పెట్టారని బొత్సా ఆరోపించారు. పోలింగ్ బూత్లో కోడెల కూర్చొని కాంపెయిన్ చేశారనీ, అయినా ఆయనపై చర్యలేవని బొత్స మండిపడ్డారు. కోడెలకి ఒక న్యాయం, అంబటికి ఒక న్యాయమా అని బొత్స ప్రశ్నించారు. ఇప్పటికైనా కోడెల తన పద్ధతి మార్చుకోవాలని బొత్స హితవు పలికారు.
ఇప్పటికే వైసిపి అధినేత వైఎస్ జగన్ పోలింగ్ రోజు జరిగిన దాడులు, వైసిపి నేతలపై కేసుల నమోదు తదితర అంశాల పరిశీలనకు ఆ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది నాయకులతో నిజ నిర్ధారణ బృందాన్ని నియమించారు. ఈ బృందం గుంటూరు జిల్లాలో గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో ఘర్షణలు జరిగిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదికను జగన్ కు అందించనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?