ఒకానొక టైంలో రాజకీయాలలో గంటా శ్రీనివాసరావు మరియు ఆవంతి శ్రీనివాస్ గురుశిష్యులు. దశాబ్దం పాటు కలిసిమెలసి తిరిగిన వీరిద్దరూ ఇప్పుడూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి ఎదుగుదలను మరొకరు భరించలేని స్థితికి చేరుకున్నారు. రాజకీయాలలో వైరం సహజమే గాని మొన్నటి వరకు కలసికట్టుగా ఉన్న ఈ ఇరువురు వార్నింగులు ఇచ్చుకోవటం కలకలం గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి నేతలకు అరెస్టుల గండం వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని టార్గెట్ చేసుకుని వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు.
2019 ఎన్నికల ముందు నాటి నుండి ఘంటా శ్రీనివాస్ తో రాజకీయ శత్రుత్వం పెంచుకున్న అవంతి శ్రీనివాస్ సందర్భం వచ్చిన ప్రతిసారీ మాటల తూటాలు పేల్చుతున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయినా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అయినా గంట నియోజకవర్గంలో అవంతి అడుగు పెట్టాడు అంటే… ఖచ్చితంగా గంటా పై విమర్శలు చేయాల్సిందే. కర్చీఫ్ మార్చినట్టు గంటా శ్రీనివాస్ పార్టీలు మారుస్తాడు, వైసీపీ పార్టీ డోర్లు మూసేయడంతో గంటా శ్రీనివాస్ పార్టీ మారకుండా ఉన్నాడని ఇటీవల అవంతి వ్యంగ్యాస్త్రాలు కామెంట్లు చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా గతంలో గంట శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో వందల కోట్ల ఖర్చులు చేసే భూములు కబ్జా అయ్యాయని … తర్వాత అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తాను ఉంటూ గజం కూడా కబ్జా కాకుండా పర్యవేక్షిస్తూ వస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ ఇటీవల పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గంట హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి కీలక సమాచారాన్ని అవంతి శ్రీనివాస్ జగన్ ముందు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇదే సమాచారాన్ని గతంలో చంద్రబాబుకు చెబితే పట్టించుకోలేదని మంత్రి అవంతి ఇటీవల తెలిపారు. కానీ ఈ విషయంలో జగన్ సర్కార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.