ఒక అధ్యాయం ముగిసింది. అయోధ్య రామమందిర నిర్మాణంతో బిజెపి మూడు దశాబ్దాల కల, మూడు దశాబ్దాల పోరాటం, మూడు దశాబ్దాల సెంటిమెంట్ సాకారం అవుతుంది. అంతా బాగానే ఉంది. బిజెపి పెద్దలు అనుకున్నది సాధించారు. బిజెపి ముందు తరం నాయకులు అయోధ్య సాకారం చేస్తే, బిజెపిలో ప్రస్తుత తరం నాయకులు అయోధ్య తర్వాత ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. నిజమే, ఇది బిజెపి లోనే కాదు. దేశీయంగా జరుగుతున్న చర్చ. బిజెపి గురించి బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అయోధ్య తరువాత ఏమిటి? ఏ అంశం పట్టుకుంటారు. ఏ అంశం పై రాజకీయం చేస్తారు? అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం.
శబరిమలను ప్రక్షాళన చేస్తారా?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నది. అయ్యప్ప ఆలయంలోకి మహిళలు అన్ని వయసుల వారు ప్రవేశించవచ్చు అంటూ 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం పెద్ద దుమారానికి దారి తీసింది. భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాలకు ఇది విరుద్ధమని వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు కాగా విచారణ జరుగుతున్నది. పలువురు మహిళలు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆలయంలో స్వామి వారి దర్శనంకు వెళ్లడం, వీరిని దీక్షా స్వాములు అడ్డుకోవడం తెలిసిందే. తొలుత సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం యువతుల ఆలయ ప్రవేశానికి పోలీస్ రక్షణ కల్పిస్తామని ప్రకటించినా భక్తుల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురుకావడంతో వెనక్కు తగ్గింది.
మధురై ఆలయం విషయంలో బీజేపీ వైఖరి ఏమిటి?
మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా పురాతన ఆలయాలలో ఒకటి. ప్రస్తుతం ఈ ఆలయం విషయంలో కూడా కొన్ని స్వల్ప వివాదాలు ఉన్నాయి. ఇది కూడా సెంటిమెంట్. అయితే ఇది తమిళనాడు రాష్ట్ర పరిధిలోని కావడంతో సాధారణంగా తమిళుల ఆలయాల జోలికి బీజేపీ వెళ్లే అవకాశం ఉండదు. ఆలా వెళితే రామేశ్వరం జోలికి కూడా వెళ్ళాలి. రామేశ్వరం ఒక ద్విపంలా దేశానికి, రాష్ట్రానికి సంబంధం లేకుండా ప్రత్యకంగా ఉంటోంది. రామేశ్వరంలో వచ్చే ఆదాయానికి, అక్కడి ప్రభుత్వానికి సంబంధం లేకుండా సపరేట్ గా ఉంది. సో.. ఇలా తమిళనాడులో ఆలయాలను ప్రక్షాళన చేస్తుందా? హిందుత్వ అజెండాతో ముందుకు వెళుతున్న బీజేపీ అయోధ్య తరువాత శబరిమల, తదితర ఆలయాలపై దృష్టి ఏమైనా సారిస్తుందా అనేది వేచి చూడాలి.