ఎత్తులు, పై ఎత్తులతో ఏపీ రాజకీయం రంజుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీని ఇరకాటంలో పడేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం అడుగులు వేస్తుంటే… టీడీపీని ఇంకా బలహీన పరిచేందుకు వైసీపీ గేమ్ అమలు చేస్తోంది.
ఇలాంటి తరుణంలో తాజాగా ఒక్క రోజులోనే ఏపీ సీఎం వైఎస్ జగన్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు షాకిచ్చారని అంటున్నారు. బీసీల విషయంలో జగన్ గేమ్ ప్లాన్కు బాబు కౌంటర్ ఇచ్చినట్లు ఆ పార్టీ సానుభూతి పరులు చర్చించుకుంటున్నారు.
జగన్ చారిత్రాత్మక నిర్ణయం
ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి చైర్మన్లను సైతం ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకంగా మారిపోతుందన్నది నిజం. ఇదే సమయంలో బీసీల ఓటు బ్యాంకుపై భారీ లెక్కలు వేసుకునే తెలుగుదేశం పార్టీకి జగన్ ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా దిమ్మతిరిగిపోయే షాక్. అంఉదకే దానికి కౌంటర్ ఇచ్చారని, ఒక్క రోజు తేడాతోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లెక్క సరిచేశారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
బాబు ఏం చేశారు?
గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు టిడిపి జాతీయ కమిటీతో పాటు తెలంగాణ కమిటీని ప్రకటించారు. తెలంగాణ అద్యక్షునిగా ఎల్ రమణనే కొనసాగించిన చంద్రబాబు ఏపీ అధ్యక్షునిగా అచ్చెన్నాయుడుకి బాధ్యతలు అప్పగించారు. గతకొంత కాలంగా అచ్చెన్న పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం రెండు రాష్ట్రాల్లోని బీసీ నేతలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే రియాక్టయ్యారని అంటున్నారు. రెండు రాష్ట్రాల టీడీపీ కమిటీలకు బీసీ నేతలకే సారథ్య బాధ్యతలు అప్పగించారని వివరిస్తున్నారు. తెలంగాణ కమిటీలో ఎల్ రమణను తప్పించాలని కొందరు నేతలు సూచనలు చేసినా చంద్రబాబు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం బీసీ సమీకరణాలే అంటున్నారు. తద్వారా ఇటు ఏపీలో అటు తెలంగాణలో బాబు బీసీ వ్యూహం అమలు చేశారని చెప్తున్నారు.