గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కూడా చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్రెడ్డి పార్టీని పక్కన పెట్టేశారనది వైసీపీ వర్గాల్లోనే ఉన్న భావన.ఇంత ముందు చంద్రబాబు కూడా ఇదే పని చేశారు. పవర్లో ఉన్నప్పుడు కేవలం అధికార యంత్రాంగాన్ని నమ్మి వారికి అత్యధిక ప్రాధాన్యం వచ్చి పార్టీ వారిని విస్మరించి చంద్రబాబు ఎంతగా దెబ్బతిన్నారో మొన్నటి ఎన్నికల్లో రుజువైంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బాగా సమర్థంగా నడిపిస్తారు.పార్టీ నాయకుల్ని కార్యకర్తలను నిద్రపోనీరు.తాను నిద్రపోడు.అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు పార్టీకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వరని విమర్శ లేకపోలేదు.ఇందువల్లే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయారని కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి.ఇక జగన్ విషయానికొస్తే ఆయన చంద్రబాబు పంధానే అనుసరిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ వ్యక్తిగా చేసిన పోరాటానికి వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన అండ కారణంగానే 2019ఎన్నికల్లో అంత ఘనవిజయం సాధ్యపడింది. కానీ ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోగానే జగన్ ప్రాధాన్యత క్రమాలు మారిపోయాయి.ఆయన పై స్థాయిలో జిల్లా కలెక్టర్లను, దిగువ స్థాయిలోకి వస్తే వార్డు వాలంటీర్లను నమ్ముతున్నారు. దాదాపు పార్టీ అసలు అవసరం లేదన్న రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని వైసీపీ నేతలు కార్యకర్తలు వాపోతున్నారు మరి ముఖ్యమైతే మంత్రులతోనో, ఎంపీలతోనో, ఎమ్మెల్యేలతోనో పనులు గానిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకులకు కార్యకర్తలకు అసలు ప్రాధాన్యమే లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అయినా పదవుల పందేరం జరగలేదు. పార్టీ అగ్ర నాయకులకయితే సలహాదారు పదవులో ఇంకొకటో ఇచ్చి సంతృప్తి పెట్టిన ముఖ్యమంత్రి సామాన్య నాయకులని, కార్యకర్తలను గుర్తించటమే లేదు.
ఇంకా చెపాలంటే జగన్ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారు.ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఎపుడూ కనిపించడంలేదు.ఆయన పార్టీ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో నిర్వహించిన దాఖలాలు కూడా లేవు.తాడేపల్లిలో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది. కానీ అక్కడ పార్టీ యాక్టివిటీస్ లేవని అంటున్నారు. ఇక జిల్లాల్లో సమస్యలను చెప్పుకుందామని పార్టీ ఆఫీస్ కి వెళ్తే పట్టించుకునే నాధుడు లేడని వైసీపీ క్యాడర్ ఆక్రోసిస్తోంది. ఇదే విధంగా మరిన్నాళ్ళు జరిగితే వైసీపీకి మిగిలేది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తప్ప పార్టీ నాయకులు ఎవరూ ఉండరని అంటున్నారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.