ఏపీలో ఇప్పుడు ప్రతి అంశం రాజకీయమయం అయిపోయింది. కరోనా కల్లోలం నుంచి మొదలుకొని కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వరకూ అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతున్నాయి.
తాజాగా ఇప్పుడు విపత్తు నిర్వహణ అంశం వెలుగులోకి వచ్చింది. వరద సమయంలో ప్రజలను ఆదుకోవడం, తగు చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోసింది. దీనికి ఇప్పటికే పలువురు నేతలు కౌంట్ ఇచ్చారు. అయితే, తాజాగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ మాత్రం ఓ రేంజ్లో కామెంట్ చేశారు.
14 ఏళ్ల బాబు చరిత్రలో….
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఈ ప్రభుత్వానికి జల నిర్వహణ తెలియదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యంగా ఉందని అనిల్ అన్నారు. “అసలు చంద్రబాబు హయాంలో 14 సంవత్సరాల్లో ఏరోజైనా వరదలు వచ్చాయా? వర్షాలు పడ్డాయా? పైపెచ్చు ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేశాను అని చెప్పుకుంటున్నాడు. అదేం చిత్రమో!` అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. “గత ఏడాది కావచ్చు, ఈ సంవత్సరంలో కావచ్చు దాదాపు 60-70రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి నీళ్లు కిందకు పారతున్నాయి. చంద్రబాబు హయాంలో ఒక్క సంవత్సరంలో ఏరోజైన అలా జరిగిందా? అంటే లేదనే అందరి సమాధానం“ అంటూ అనిల్ వివరించారు.
చంద్రబాబు… నువ్వు తుపానులను ఆపావా ?
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు తుపాన్లను రావద్దని ఏమైనా ఆపాడా అంటూ మంత్రి అనిల్ పంచ్ వేశారు. “ఆయన సీఎంగా ఉన్నపుడే తిత్లీ, హుద్ హుద్ లాంటి తుఫాన్ లు వచ్చాయి. ఏం చేశారో అందరికీ తెలుసు. పవర్ ప్లాంట్ ను ముంచిన వ్యక్తి అయిన చంద్రబాబు ఫ్లడ్ మేనేజ్ మెంట్ మేధావి అని డబ్బా కొట్టుకుంటున్నాడు. పుష్కరాల్లో చంద్రబాబు మేనేజ్మెంట్ వల్ల 29 మంది చనిపోయారు. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆ బాధితుల కుటుంబాల ముందు తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకున్నావు. అటువంటి మేనేజ్మెంట్ లు మాకు చేతకావు, మీడియా అటెన్షన్ కోసం బోయపాటి, రాజమౌళిలను తీసుకురాలేము.“ అంటూ అనిల్ ఆరోపించారు.
1989లో ఏం జరిగింది బాబు?
1998లో శ్రీశైలంకు వరద వచ్చినప్పుడు ఏం జరిగిందో చంద్రబాబు గుర్తు చేసుకోవాలని మంత్రి అనిల్ అన్నారు. “అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఫ్లడ్ మేనేజ్ మెంట్ లో మేధావినని చెప్పుకునే చంద్రబాబు పవర్ ప్లాంట్ను ముంచిన మాట వాస్తవం కాదా? సంవత్సరం పాటు పవర్ ప్లాంట్ ఆపరేషన్ లోకి రాకుండా ఉంది వాస్తవం కాదా? ఈ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ వాళ్లు సూటిగా సమాధానం చెప్పాలి. అటువంటి మేనేజ్ మెంట్ మాకు చేతకాదు.. గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలే కార్యక్రమం చేస్తామే కానీ పవర్ ప్లాంట్ ముంచే లాంటి కార్యక్రమాలు మాకు చేతకావు, అటువంటి ఘన చరిత్ర చంద్రబాబుదే. “ అంటూ ఎత్తిపొడిచారు. వర్షాలు విస్తారంగా పడుతుండటం, డ్యామ్లు అన్నీ నిండుతుంటే.. తామున్నపుడు పడలేదన్న ఏడుపుతో చంద్రబాబు బాధ పడుతున్నాడు అంటూ మంత్రి అనిల్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉంటే దరిద్రం తాండవం, కరువు తాండవం, వర్షాలు పడవు అంటూ దుమ్మెత్తి పోశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?