నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. మరోపక్క గ్రేటర్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా మంత్రి కేటీఆర్ కి అప్పజెప్పారు కేసీఆర్. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి జరగబోయే ఎన్నికల ప్రచారం విషయంలో డిజిటల్ తరహాలో ఎక్కువగా పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే రీతిలో నాయకులు వ్యవహరించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా గతంలో మాదిరిగా ఈసారి జరగబోయే ఎన్నికల ఫలితాలు ఉండవని నగర పరిధిలో ఉండే టిఆర్ఎస్ పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పినట్లు పార్టీలో టాక్. ఇదే విషయం ఇటీవల నగరంలో చేసిన సర్వేలో బయటపడినట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలు అనేక రీతులుగా ఇబ్బందులు పడ్డారని అధికార పార్టీ పెద్దగా పట్టించుకోలేదని హైదరాబాద్ వాసులు భావిస్తున్నారట. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో పోలీసులు అనేక కేసులు కూడా పెట్టడంతో టిఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని కొన్ని సర్వేలలో బయటపడింది.
ముఖ్యంగా వర్షాల సమయంలో రోడ్డు మొత్తం జలమయం కావడంతో పాటు మ్యాన్ హాల్స్ వలన ప్రాణాలు కూడా పోవడంతో… ఈ ఘటనలు టిఆర్ఎస్ పార్టీకి జరగబోయే ఎన్నికలలో డ్యామేజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చాలా కాలనీలు వర్షాలు పడిన సమయంలో జల దిగ్బంధంకి గురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్ ఏ విధంగా పార్టీని విజయపథం వైపు నడిపిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క టికెట్ కేటాయించే విషయంలో టిఆర్ఎస్ పార్టీలో తాజాగా గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయినట్లు, దీంతో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి టిఆర్ఎస్ పార్టీకి వెళ్లడం అనేది కష్టమే అన్న టాక్ బలంగా వినబడుతోంది.