రోజా ఏడ్చింది… తనకు ఏ అధికారి గౌరవం ఇవ్వడం లేదని, ఏ సమాచారం తెలియడం లేదని కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, శాసనసభ హక్కుల కమిటీ ముందు బోరున ఏడ్చింది.. మీడియా అంతా దానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది.. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఫైర్ బ్రాండ్ రోజా ఒకేసారి ఏడవడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే రోజా ఏడుపుల వెనుక ఉన్న అసలైన రాజకీయ కథ ఇప్పుడే బయటకు వస్తోంది. ఉపముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి రోజా ఆవేదన మీద స్పందించారు. ఆయన ఎందుకు స్పందించారు? రోజాకు ఆయనకు సంబంధం ఏమిటి? రోజా ఏడుపు వెనుక ఆయనకు సంబంధం ఏమిటి అన్న విషయాలను చిత్తూరు జిల్లా రాజకీయాలను దగ్గర్నుంచి పరిశీలించిన వారికి తెలుస్తుంది.
టార్గెట్ నారాయణ స్వామి!
గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు నారాయణ స్వామి కు దళితుల కోటాలో జగన్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇది ఆయనే కాదు జిల్లా వాసులు సైతం ఊహించనిది. అప్పటినుంచే అసలు కీచులాట మొదలైంది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన పదవులపై ఆశలు పెట్టుకున్న నగిరి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్లను పక్కనపెట్టి జగన్ నారాయణ స్వామి కి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏకంగా అత్యంత పోషకాలు కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనను ఎంపిక చేయడం చాలామందికి నచ్చలేదు. అందరితో సన్నిహితంగా మెలిగే అత్యంత సున్నిత మనస్కుడు గా పేరున్న నారాయణస్వామి ఎంపిక విషయంలో లోలోన రాజకీయాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా రాజకీయాలు అన్నిటినీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసిస్తారు. పెద్దాయన గా పిలవబడే ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయి. నారాయణస్వామి కు పెద్దిరెడ్డి కు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినప్పటికీ… ఆయనకు ఉన్నతమైన ఉపముఖ్యమంత్రి పదవి దక్కడంలో జగన్ ఒక కీలకమైన స్ట్రాటజీ ప్రకారమే నారాయణ స్వామిని దళిత కోటాలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అంటే పెద్దిరెడ్డి కి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లాలో ఆయనకున్న ఉన్నతమైన ప్రోటోకాల్ నారాయణస్వామికి దక్కుతుంది. అప్పటి నుంచే పెద్దిరెడ్డి కు ఒక ముఖ్య మంత్రికి మధ్య కొన్ని అంతర్గత పోరాపొచ్చలు వచ్చాయి. దీంతోనే ఇప్పుడు నారాయణ స్వామి పదవికి ఎసరు పెట్టే కార్యక్రమాలు జోరందుకున్నాయి.
అనుకున్న దానికంటే వేగంగా!
మంత్రివర్గాన్ని రెండున్నర సంవత్సరాలకు పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జగన్ ముందుగానే చెప్పారు. అంటే ఈ ఏడాది నవంబర్ నాటికి కొత్త మంత్రివర్గం కొలువు తీరాలి. అయితే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నారాయణస్వామి మంత్రి పదవికి ముందుగానే ఎసరు పెట్టే కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. దీనినే నగిరి నియోజకవర్గం కేంద్రంగా నడిపిస్తున్నట్లు ఇప్పుడు అర్థం అవుతోంది. నగిరి నియోజకవర్గంలో రోజా సొంత పార్టీలోనే గ్రూపును ఎదుర్కొంటుంది. నగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేజీ కుమార్ ఒక వర్గం పెట్టి గ్రూపు గా తన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇప్పిచుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అప్పట్లోనే రోజా కుమార్ల మధ్య వివాదాలు చిత్తూరు జిల్లాలో సంచలనం అయ్యాయి. కుమార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారు అన్న అభిప్రాయం రోజా లో నెలకొంది. దానిలో భాగంగానే తర్వాత తర్వాత రోజాకు కొన్ని విషయాల్లో అధికారులు సహకరించకపోవడంతో ఆమె నారాయణ స్వామి ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు వైకాపా అధిష్టానానికి శాసనసభ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే సాధారణంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి దే ప్రధాన పాత్ర. నారాయణ స్వామి పాత్ర అంతంతే. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి టార్గెట్ గా కాకుండా నారాయణస్వామి టార్గెట్ అవ్వడం వెనుక ఆయన బలహీనత ఆయన రాజకీయ చతురత లేకపోవడమే ప్రధాన కారణం. ఆయనను ఎలాగైనా తప్పించి… జిల్లాలో తనకు తిరుగులేకుండా చేసుకోవాలనేది పెద్ధి రెడ్డి ఆలోచన. ఈ దిశగానే ఇప్పుడు రోజాతో ఆయనే వెనకుండి ఈ కథ అంతా నడిపిస్తున్నారని చర్చ చిత్తూరు జిల్లా రాజకీయాల జరుగుతోంది.