‘నాకు అందిన గొప్ప బహుమతి బిజెపి నుంచీ, ఆర్ఎస్ఎస్ నుంచీ వచ్చే తిట్లు. ప్రధాని మోదీ నన్ను దూషించినప్పుడల్లా వెళ్లి ఆయనను కౌగలించుకో బుద్ది వేస్తుంది’, ఆని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ను చూస్తే నరేంద్ర మోదీకి కోపం. అయినా పరవాలేదు. ఆయనపై మాకు కోపం లేదు. మా పద్ధతి అది. మేము ఎవరినీ ద్వేషించం, అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ శుక్రవారం భువనేశ్వర్లో మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యలను ప్రస్తావిస్తూ, విద్వేషం వల్ల సాధించేదేమీ లేదని ఆ విషాదాల ద్వారా అర్ధమైందని రాహుల్ అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. తమ శాఖలకు ఒఎస్డిలను నేరుగా నాగపూర్ నుంచి నియమిస్తున్నారని ఢిల్లీలో మంత్రులు చెబుతున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికా బద్ధమైన దాడి జరుగుతోందని రాహుల్ పేర్కొన్నారు. బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉండాల్సింది తమ సంస్థ ఒక్కటేనని అనుకుంటోంది. గత నాలుగేళ్లలో ఈ విధ్వంసం చాలా జరిగింది. కాంగ్రెస్కు రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై నమ్మకం ఉంది. ఎన్నికల తర్వాత ఈ చెడును మర్మమత్తు చేయాలి. అని ఆయన అన్నారు.