హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని భట్టి మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
స్పీకర్ను కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరామని భట్టి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయమని పిటిషన్ ఇచ్చామని భట్టి పేర్కొన్నారు.
రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, సబితా ఇంద్రారెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరామనీ, మిగతా వారిపై ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది కాంగ్రెస్కు హ్యాండిచ్చి కారెక్కారు.
ఖమ్మం జిల్లా నుండి రేగ కాంతారావు (పినపాక), అత్రం సక్కు (అసిఫాబాద్), హరిప్రియ నాయక్ (ఇల్లందు), కందల ఉపేంద్రర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), రంగారెడ్డి జిల్లా నుండి పి సబితా ఇంద్రారెడ్డి (మల్లేశ్వరం), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్ బి నగర్), నల్లగొండ జిల్లా నుండి చిరుమర్తి లింగయ్య (నకిరేకల్లు), మహబూబ్ నగర్ జిల్లా నుండి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టిఆర్ఎస్లో చేరారు.