Alla Ramakrishna Reddy : మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు అదనంగా మరో నలుగురు గన్ మెన్ లను కేటాయించింది ప్రభుత్వం. అమరావతి రాజధాని భూముల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడి అమ్మకాలు కొనుగోలు విషయంలో భారీ అవినీతికి పాల్పడింది అంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై పోరాడుతున్న సంగతి తెలిసిందే.
దళితుల అసైన్డ్ భూములను చంద్రబాబు మరియు ఆయన బినామీలు భయబ్రాంతులకు గురి చేసి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి 500 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ విషయంలో సిఐడికి ఫిర్యాదు చేయటం.. తాజాగా సిఐడి ఈ విషయంలో కీలక నాయకులకు నోటీస్ లు ఇవ్వడం మాత్రమే కాక విచారణకు హాజరు కావాలని కూడా తెలపటం అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్కే కి ఒకరు మాత్రమే గన్ మెన్ ఉండటం జరిగింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్కే గారికి మరో నలుగురు గన్ మెన్ లు తోడవుతున్నారు.