Inter Exams: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కానీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకే విధానం లేదనీ, దీంతో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా కొన్ని రాష్ట్రాల్లో వాయిదా వేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు.
పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివే విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్ లతో సర్టిఫికెట్ లు వస్తాయనీ, మార్కులు, ర్యాంకులు ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్నారు. ఇంటర్ తరువాత చదివే పోటీ పరీక్షలకు కూడా ఇంటర్ లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందన్నారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వ పరంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు కూడా పరీక్షల విషయంలో పునరాలోచన చేయాలని సూచించినందున కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం తేదీలను ప్రకటిస్తుందన్నారు. ఇదే విషయాన్ని రేపు హైకోర్టుకు తెలియజేస్తామన్నారు.
కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల ఏపి హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.