కరోనా సమయంలో ప్రపంచం అంతా నిధుల వేటలో ఉంది. ఇలాంటి సమయంలో పెట్టుబడులు రావడం, అందులోనూ భారీ పెట్టుబడులు అంటే, నిజంగా అభినందనీయం. అలాంటిది ఒకే రోజు భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు అంటే ఖచ్చితంగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని రూపొందించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు.
ఐదు కంపెనీల ప్రకటన
ఒకే రోజు ఐదు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఇవి పాలసీ లాంచింగ్ రోజే పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణలోకి ఆకర్షించింది. ఇందులో భాగంగా పలు కంపెనీలు రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ప్రకటించాయి. మూడు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోగా, మరో రెండు కంపెనీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లను అందించారు. ఇందులో భాగంగా మైత్ర ఎనర్జీ 2 వేల కోట్ల రూపాయలను, ఒలెక్ట్రా 300 కోట్ల రూపాయలను, ఈటీఓ మోటార్స్ 150 కోట్లను, గాయం మోటార్స్ 250 కోట్లను, ప్యూర్ ఎనర్జీ 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 14 750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణను ఎలక్ర్టిక్ వాహనాల హబ్గా మార్చబోతున్నామని, ఎలక్ర్టిక్ వాహనాలు పర్యావరణ ఫ్రెండ్లీ వెహికల్స్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ విజయవంతం అయ్యాయి. ఎలక్ర్టిక్ వాహనాలు కూడా విజయవంతం కాబోతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు పడ్డారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యతను కరోనా మరోసారి గుర్తు చేసిందన్నారు. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీ సెంట్రలైజేషన్ అమలు చేయాలని సూచించారు.