బీహార్ అంటేనే కులాల కుంపట్లు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓ వర్గం ఓట్లు, ఎల్ జీపీకి పాశ్వాన్ తరపు దళిత ఓట్లు.. అనే లెక్క ఉంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య అనధికారిక పొత్తు ఉండడంతో ఈ రెండు వర్గాల ఓటర్లు ఏకమై బీజేపీని నిలబెడతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక.. నితీశ్ కుమార్ వైపు ఓబీసీలు, వెనుకబడిన వర్గాలు నిలబడతారు. ఇక లాలూ కుటుంబం వెనుక మస్లింలు, యాదవులు ఉంటారు. మధ్యలో ఎఐఎం వెళ్లడంతో ఓట్లు చీలిపోయి.. పరోక్షంగా బీజేపీ లాభపడేలా చేస్తోంది. మొత్తంగా బీహార్ ఓటింగ్ ఇదే తరహాలో ఉంటుంది. అయితే.. ఈసారి బీహార్ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పన ప్రధాన ఎజెండాగా మారిపోయింది.
బీహార్ లో కొత్త విప్లవం.. ‘నిరుద్యోగం’
ప్రతి పార్టీ కూడా ఇదే అంశాన్ని తీసుకుంటోంది. కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత బీహార్ యువత ఉద్యోగాల కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కారణం.. లాక్ డౌన్ తో ఏకంగా బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన దాదాపు 25 నుంచి 30 లక్షల మంది మళ్లీ వెనక్కు వచ్చేశారు. ఈసారి తాము మరెక్కడికీ వెళ్లమనీ.. సొంత రాష్ట్రమే ఉపాధి కల్పించలని డిమాండ్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఫర్ ఇండియన్ ఎకనమీ లెక్కల ప్రకారం ఈ ఏప్రిల్ నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం లేకుండా ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న నిరుద్యోగం కంటే రెట్టింపు ఒక్క బీహార్ లోనే ఉందని తేల్చింది.
పార్టీల వైఖరి ఇదీ..
తాము అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ నుంచి తేజశ్వీ యాదవ్ అంటున్నారు. ఇది అసాధ్యం అంటూ సీఎం నితీశ్ కొట్టిపారేశారు. కానీ.. ఆయన మిత్రపక్షం బీజేపీ ఏకంగా 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అంటోంది. ఏ ప్రాతిపదికన కల్పిస్తారో మాత్రం చెప్పరు. అయితే.. కరోనా నేర్పిన గుణపాఠాల్లో తమ రాష్ట్రమే తమకు ఉద్యోగాలు కల్పించాలని యువతలో ఓ మేల్కొలుపు రావడం ఒకటి. దీంతో ఇన్నాళ్లూ రాజకీయా పార్టీలు ఆడుతున్న కులాల ఆటలకు కాలం చెల్లే పరిస్థితులు వచ్చాయి. దీంతో ఈసారి ఏ పార్టీ గెలుపైనా నిరుద్యోగుల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది. మరి.. నేతలు ఏం చేస్తారో చూడాలి.