ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశంలో ఏ పార్టీ వైఖరి ఏంటని చూస్తే.. వైసీపీ, టీడీపీ తమ మాట మీదే ఉన్నాయి. కానీ.. బీజేపీ వైఖరేంటో ఆ పార్టీ నాయకులకే అర్ధం కావడం లేదు. రామ్ మాధవ్, జీవీఎల్, సోము వీర్రాజు.. కూడా ఒక్కోసారి ఒక్కో అభిప్రాయం చెప్తున్నారు. కేంద్రానికి సంబంధం లేదంటూనే.. అమరావతి రైతులకు నష్టం కలుగకూడదంటారు. రాజధాని విషయం రాష్ట్రానిదే అంటూనే అమరావతి పోరాటానికి మద్దతుంది అంటారు. ఇలా.. సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో తడబడుతోందని అర్ధమవుతోంది. వైసీపీకి బీజేపీకి ఉన్న అంతర్గత సంబంధాల నేపథ్యంలో రాజధానుల అంశానికే జై కొడుతోంది. అయితే.. బీజేపీ స్నేహితుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. అది వ్యూహమో, పోరాటమో అర్ధం కావడం లేదు.
అమరావతికి అనుకూలంగా కోర్టుకు జనసేన..
రాష్ట్ర రాజధాని అంశంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరింత గందరగోళంగా మారాయి. బీజేపీతో స్నేహం దృష్ట్యా రెండు పార్టీలు ఒకే విధానంతో వెళ్లాలి. కానీ బీజేపీకి ఉన్న తడబాటే జనసేన చూపిస్తోంది. అమరావతి రైతులుకు అన్యాయం జరుగకూడదు.. 33వేల ఎకరాలు రాజధాని కోసమే.. అంటూ ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అనేకమందితో సంప్రదింపుల అనంతరమే ఈ విషయంపై జనసేన అమరావతిపై పోరాడేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు. ఇది ముందస్తు వ్యూహమా.. బీజేపీకి వ్యతిరేకంగా జనసేన సొంత నిర్ణయమా.. ప్రజాభీష్టం అమరావతికే అని చెప్పడమా.. లేక బీజేపీ–జనసేన కలిసి వ్యూహాత్మకంగా వెళ్తున్నాయా అనేది అర్ధం కాని ప్రశ్న.
బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా.. నియంత్రిస్తుందా..?
జనసేన పార్టీ బీజేపీతో స్నేహం ఉంది. వచ్చే ఎన్నికల వరకూ కలిసే వెళ్తామని ప్రకటించాయి. మరోవైపు బీజేపీకి వైసీపీకి అంతర్గత స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం.. కోర్టులో పిటీషన్ వేయడం.. రైతుల తరపున ప్రత్యక్షంగా పోరాడుతామనడం పలు చర్చలకు తావిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై అనేక పిటిషన్లు కోర్టులో ఉన్నాయి. రైతులు పోరాడుతున్నారు. ఇప్పుడు వీటన్నింటికీ జనసేన తోడైతే ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఖాయం. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై బీజేపీతో అంతర్గత స్నేహం ఉన్న వైసీపీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఇది బీజేపీకి క్లిష్టంగా మారే అవకాశం ఉంది. పవన్ ను నియంత్రిస్తుందా.. వదిలేసి ఎవరి దారి వారిదే అంటుందా.. జగన్ కు మద్దతిస్తుందా.. అనేది కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మొత్తంగా జనసేన–బీజేపీ రాజధాని అంశంపై ఓ మాట మీద లేవని అర్ధమవుతోంది.