ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్మోహన రెడ్డిల వ్యవహార శైలి కొన్ని విషయాల్లో భిన్నంగా, కొన్ని విషయాల్లో సారూప్యంగా ఉంటాయి. సంక్షేమ పథకాల అమలులో ఎవరి స్టైల్ వారిదే. ప్రభుత్వంలో ఆర్ టి సి విలీనం చేయడం మంచి నిర్ణయం కాదన్నది కెసిఆర్ అభిప్రాయం కాగా ఆంధ్ర ప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. అయితే ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బ తీసే విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ చావు దెబ్బ తీయగా, ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా తొలగించే పనిలో జగన్ ఉన్నారు. ఎన్ డీఏ లో లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదితో ఇద్దరు సిఎం లు కేసీఆర్, జగన్ ఘర్షణ పూరితంగా, దూరంగా అయితే లేరు. వివిధ అంశాలలో కేంద్రానికి అటు కెసిఆర్, ఇటు జగన్ మద్దతు ఇస్తూనే ఉన్నారు. విషయం లోకి వెళితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వినాయక చవితి వేడుకల నిర్వహణకు ఆంక్షలు విధించడం హింధూత్వ అజండా మోస్తున్న బిజేపి నేతలకు ఆగ్రహం కల్గిస్తోంది.
వివాహాలు, ఇతర వేడుకలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చిన మాదిరిగానే వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వాలని అటు తెలంగాణలో బిజెపి చీఫ్ బండి సంజయ్, ఇటు ఆంధ్రాలో బిజెపి చీఫ్ సోము వీర్రాజులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా అటు కెసిఆర్ గానీ ఇటు జగన్ గానీ పట్టించుకోలేదు. దీనితో కమల దళాలు అటు కెసిఆర్ సర్కార్ పై, ఇటు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపిలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి వారం రోజుల నుండి చేసిన ట్వీట్ లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ వినాయక చవితి మండపాలు ఏర్పాటుకు అవకాశఁ కల్పించాలని బిజెపి నేతలు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వినాయక చవితి వేడుకలు సంబంధంచి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా విగ్రహం ఎత్తు రెండు అడుగులు మించి ఉండకూడదని పేర్కొన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన రోజునే నిమజ్జనం చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే బిజెపి నేతలు మాత్రం ఈ నిర్ణయాలను తప్పుబడు తున్నారు. ముస్లింల మోహరం పండుగకు ఇచ్చినవెసులు బాటు హింధువుల పండుగకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులకు లేని ఆంక్షలు వినాయక చవితి వేడుకలకు ఎందుకని విష్ణఉవర్థన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో తెలంగాణలో అయితే అక్కడి బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో ప్రభుత్వంపై గొడవ పడటానికే సిద్ధం అయ్యారు. వినాయక చవితి మండపాల నిర్వహణకు పోలీసులు అడ్డుకుంటేసహించేది లేదని బండి హెచ్చరించారు. నిమిజ్జన వేడుకలకు ఇబ్బందులు సృష్టిస్తే కేసిఆర్ ఇంటి ముందే విగ్రహాల నిమజ్జనం చేస్తామని కూడా హెచ్చరించారు బండి సంజయ్.
సాధారణంగా దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. పట్టణం, నగరం, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వాడవాడలా చలువ పందిళ్లు వేసి ఆకర్షనీయమైన వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. హింధువుల అతి పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇప్పటి వరకూ వినాయక చవితి వేడుకలను ప్రభుత్వాలు అడ్డుకున్న సందర్భాలు ఇంత వరకూ లేదు. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు వినాయక వేడుకలపై ఆంక్షలను విధించింది. గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహించాలన్న పట్టుదలతో బిజెపి ఉంది. సెంటిమెంట్ తో ముడిపడిన ఈ అంశంలో వ్యవహారం ఎటు దారితీస్తుందోే వేచి చూడాలి.