ఏపి రాజధాని అంశంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు ఇటీవలే ఆ పార్టీతో జత కట్టిన జనసేన స్పష్టమైన వైఖరితో ఉన్న విషయం తెలిసిందే. బిజెపి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్మినారాయణ, పవన్ కళ్యాణ్ లు తొలి నుండి అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన నిరసన, ఆందోళనలు 200 రోజులకు చేరాయి. మరో పక్క రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితి లోనూ జరిపి తీరాలన్న పట్టుదలతో జగన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ అందరికీ తెలిసిందే.
రాష్ట్ర బీజేపీ, జనసేన వత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకొని రాజధాని తరలింపును అడ్డుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశతో ఉన్నారు. అయితే అయన ఆశలు అడియాశలు అయ్యేలా బిజెపి కీలక నేత ఒకరు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
అయన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. మా పార్టీ నేతలు రాజధాని తరలించవద్దని అరుస్తూనే ఉంటారు..రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవచ్చు..కేంద్రం మాత్రం జోక్యం చేసుకోదు అంటే అర్ధం ఏమిటంటారు?.
ఈ మాటలు అన్నది ఆ పార్టీలో చిన్న నాయకుడు ఏమీకాదు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్. ఇంతకూ అయన ఏమన్నారంటే..ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి మారదట. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ కు బీజేపీ కట్టుబడే ఉందట. అమరావతి రైతుల పక్షాన బీజేపీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటుందట. బీజేపీ-జనసేన శ్రేణులు అమరావతి రైతులకు అండగా ఉంటారట. రాష్ట్ర స్థాయిలో భవిష్యత్ పోరాటాలు ఉమ్మడిగా చేస్తారట. ఇంత వరకు బాగానే ఉందికదా..! అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు. భవిష్యత్లో కూడా కేంద్రం జోక్యం చేసుకోదు అని సునీల్ దేవధర్ సెలవు ఇచ్చారు.
అమరావతి నుండి రాజధాని అంగుళం కూడా కదలదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తానంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు అని నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చిన అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇప్పుడు ఏమంటారు?. కేంద్రంలోని బిజెపి అండ లేకుండా స్థానిక బిజెపి నేతలు ఎంత అరిస్తే ఏమిటి ఉపయోగం!. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని తెలిసే ముఖ్య మంత్రి జగన్ తన పని తాను చేసుకుపోతున్నట్లు ఉన్నారు.