Tirupati Bypoll : తిరుపతి ఉప ఎన్నిక Tirupati Bypoll త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ, ఉనికి చాటుకోవాలని బీజేపీ, టీడీపీ చూస్తున్నాయి.
బీజేపీ మిత్రపక్షంగా జనసేన సాయం చేయడం ప్రత్యేకంగా పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 17న జరుగుతున్న ఎన్నిక కోసం పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని, టీడీపీ తమ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించాయి. అయితే.. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించకుండానే క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రచార కమిటీని నియమించేసింది. ఉప ఎన్నిక కోసం ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందినప్పటి నుంచీ బీజేపీ తిరుపతిలో పనులు మొదలెట్టేసింది.
నగరంతోపాటు నియోజకవర్గాల్లో కూడా కేడర్ తిరిగింది. అయితే.. అప్పుడు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీ ప్రకటించలేదు. ఇప్పుడా ప్రకటన వచ్చేసింది. ఇంకా అభ్యర్ధి ప్రకటన లేదు. జనసేన ఇక్కడ పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ.. బీజేపీ తన పంతం నెగ్గించుకుంది. సరే.. జనసేన మిత్రపక్షంగా పని చేస్తుంది. కానీ..
అభ్యర్ధి లేకుండా ప్రజల్లోకి వెళ్లేదెలా? పైగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి నేతృత్వంలో ప్రచార కమిటీని నియమించింది. నియోజకవర్గాల్లో కూడా ఇంచార్జులను ప్రకటించేసింది. సోము వీర్రాజు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి. పురంధేశ్వరి, సునీల్ ధియోధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, బైరెడ్డి, ఐవైఆర్, రావెల కిశోర్ బాబు.. ఇలా ఎందరెందరో నేతలు అక్కడ కదనరంగంలోకి దిగుతున్నారు. కానీ..
ఇంకా అభ్యర్ధి ప్రకటన లేకుండా ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్తారు. తమ అభ్యర్ధిని గెలిపించండి అని చెప్పడానికి కూడా లేకుండా పార్టీని గెలిపించండి అంటే ఓటర్లు స్వీకరిస్తారా? అనేది ప్రశ్న. బీజేపీ తతంగాన్ని మిత్రపక్షంగా జనసేన చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించలేని పరిస్థితి. తమకు పట్టుందని జనసేన చెప్పినా వినని బీజేపీ జీహెచ్ఎంసీ తర్వాత మరోసారి జనసేనను ఊరుకోబెట్టేసింది. పోనీ.. పోటీకి చూపించిన దూకుడును అభ్యర్థి ప్రకటనలో చూపించిందా అంటే అదీ లేదు. ఎన్నికల ప్రచారం అంటే అభ్యర్ధిని ముందు పెట్టి వెనక పార్టీ నాయకత్వం ఉండాలి. ఇప్పటికైతే బీజేపీ అలా చేయలేదు.. మరెప్పటికి చేస్తుందో..?