పణజి: వారసుల విషయంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. కొంతమంది నాయకుల కుమారులు, కుమార్తెలను ఎన్నికల బరిలోకి దించుతున్నా, మరికొందరికి కమలం పార్టీ మాత్రం చెయ్యిస్తోంది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ పార్టీలో చేరగానే గురుదాస్ పూర్ నియోజకవర్గ టికెట్ ఇచ్చేశారు. కానీ బీజేపీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అనారోగ్యంతో ఉన్నా విధులకు హాజరైన రక్షణశాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కుమారుడికి మాత్రం చుక్కెదురైంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గానికి తాను పోటీ చేయాలని ఆయన భావించారు. తన ఉద్దేశాన్ని బీజేపీ అధిష్ఠానానికి కూడా చెప్పారు.
కానీ, బీజేపీ అధిష్ఠానం మాత్రం అందుకు పెద్దగా సుముఖత చూపలేదు. ఆ స్థానానికి తమ పార్టీ తరఫు నుంచి పనాజీ మాజీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ పేరును అభ్యర్థిగా ప్రకటించింది. పారికర్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రిగా వెళ్లినప్పుడు పనాజీ నుంచి సిద్ధార్థ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకుని ఆయనకే పనాజీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కేటాయించింది.
అయితే ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. మనోహర్ పారికర్ నీతి నిజాయితీలకు పెట్టింది పేరు. కానీ ఆయన కుమారుడు ఉత్పల్ మీద మాత్రం అటవీ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అవి ఇంతవరకు నిరూపితం కాలేదు గానీ, ఒక సారి మచ్చపడిన వ్యక్తికి పార్టీ అభ్యర్థిత్వం ఇస్తే విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందనే బీజేపీ వెనకడుగు వేసిందని అంటున్నారు.