Ap Bjp : రాజకీయాలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉన్నాయని చెప్పాలి.ఏపీ బీజేపీ Ap Bjp దక్షిణాదిన కర్ణాటక మినహా బీజేపీకి పట్టున్న రాష్ట్రం లేదు. తెలంగాణలో కాస్త ప్రాబల్యం ఉంది. అయితే.. దశాబ్దాలుగా ఉన్న మతపరమైన అంశాల నేపథ్యంలో హైదరాబాద్ లో బీజేపీ ఉనికి కాపాడుకుంటూ వస్తోంది. అయితే.. ఇటివల హైదరాబాద్ లో ఎక్కువగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతోంది బీజేపీ. ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ కునికిపాట్లు పడుతూనే ఉంది. వీటిలో ఏపీ ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం పెరగడంతో ఏపీలోని నాయకుల్లో ఆశలు పెరిగాయి. పైగా.. తెలంగాణలో నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల ఇందుకు కారణమయ్యాయి. అయితే.. ఏపీలో బీజేపీకి అంత సీన్ ఉందా..? అనేదే ప్రశ్న.
కన్నా అలా.. సోము ఇలా..
ఏపీలో బీజేపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ చేసిందేమీ లేదు. టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శ తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా నిజమైన బీజేపీ వ్యక్తిగా ఆయన తనదైన మద్ర వేసుకోలేకపోయారు. గుర్తించిన అగ్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమింది వాగ్దాటి, దూకుడు ఉన్న బీజేపీ వ్యక్తి సోము వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించింది. వచ్చీ రావడంతోనే తనదైన మార్కు చూపి.. టీడీపీ సానుభూతిపరులు అని డౌట్ ఉన్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అధ్యక్షుడి హోదాలో విధి విధానాలు, బీజేపీ నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాపులను దగ్గర చేసుకునేందుకు పావులు కదిపారు. చిరంజీవి, పవన్ ను కలిసి తన మార్కు చూపించారు. ఇటివలే ముద్రగడతో భేటీ అయి సంచలనం రేపారు. బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్న టీడీపీ ఆలోచనలను తిప్పికొడుతూ రాజకీయంగా దూసుకెళ్లారు. ఇటివల ఆయన స్పీడుకు కొంత బ్రేకులు పడ్డాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
ఏపీ బీజేపీ తడబాట్లు..
రాజధాని అంశంలో కేంద్రం మాటే ఫైనల్ అన్నారు. కాదు.. అది ఏపీ ప్రభుత్వం ఇష్టం అన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటాం.. రాజధాని ఇక్కడే ఉండాలి అన్నారు ఆ తర్వాత. బీజేపీ అధికారంలోకి వస్తే జిల్లాకో రాజధాని ఏర్పాటు చేస్తాం.. అంటూ ఛాలెంజింగ్ గా మాట్లాడారు. వైసీపీతో సయోధ్య అన్నట్టుగా వ్యవహరించి మళ్లీ కాస్త వ్యతిరేక ఛాయలు చూపించారు. జనసేనతో మైత్రి కొనసాగిస్తూనే తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధే ఉంటారని ప్రకటించి అక్కడ క్షేత్రస్థాయిలో పని చేయడం ప్రారంభించారు. ఓపక్క జనసేన తమ అభ్యర్ధినే నిలబెడతామంటున్నా వెనక్కి తగ్గలేదు.. ఓ ప్రకటన కూడా చేయలేదు. ఇటివల ఓ సమావేశంలో ఏపీకి బీసీని సీఎం చేసే దమ్ము జగన్, చంద్రబాబుకు ఉందా..? ఆ దమ్ము బీజేపీకి మాత్రమే ఉంది అన్నారు. పవన్ తో దోస్తి మర్చిపోయారో.. 2024లో తాము అధికారంలోకి వస్తే పవనే సీఎం అన్న తన వ్యాఖ్యలు కూడా మర్చిపోయారో కానీ.. నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు అనేశారు. తమతో స్నేహానికి బీజేపీ అధిష్టానం సుముఖంగానే ఉన్నా.. రాష్ట్ర బీజేపీ సహకారం ఉండటం లేదు.. అన్న పవన్ వ్యాఖ్యలు మిస్సైల్ లా తాకాయి. కేంద్రం ఆదేశాలో ఏమో మరునాటికి పవన్ ఇంటికెళ్లి ఉమ్మడి ప్రకటన చేశారు.
తక్షణ కర్తవ్యం ఏంటో..
ఇప్పుడు కొత్తగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటిస్తే రాష్ట్రం భగ్గుమంటోంది. ఈ సమయంలో తమ స్టాండ్ చెప్పలేదు. కేంద్రాన్ని ఒప్పిస్తామని పురంధేశ్వరి వంటి నాయకులు అంటున్నా స్థానిక బీజేపీ నుంచి అంత గట్టిగా మాట లేదు. సోము వీర్రాజే కాదు.. విష్ణుకుమార్ రాజు, విష్ణువర్దన్ రెడ్డి.. వంటి నాయకులు కూడా గట్టిగా వాదించలేని పరిస్థితి. కేంద్రాన్ని ఒప్పిస్తాం.. విశాఖ ఉక్కును కదలనివ్వం అని ఒక ప్రకటనైతే చేశారు కానీ.. ఉద్యమ స్థాయిలోకి వెళ్లలేదు. వెళ్లలేరు కూడా. కానీ.. సుజనాచౌదరి మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విశాఖ ఉక్కు ప్రైవైటీకరణ ఆపలేరు అని స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. దీంతో ఏపీ బీజేపీకి.. అధిష్టానానికి మాట ఒకటి కాదా.. అనే అనుమానాలు వచ్చాయి. ఇన్ని పరిస్థితులను విశ్లేషిస్తే సమీప భవిష్యత్తులో తెలంగాణ మాదిరిగా ఏపీలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతుందా..? అనేది సందేహమే.