Bjp-Janasena :బీజేపీ జనసేన Bjp-Janasena పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే.. తర్వాత కాలంలో బేధాభిప్రాయాల నడుమ సొంత దారుల్లోనే వెళ్లారు. కానీ.. ఈమధ్య మళ్లీ పొత్తుకు వెళ్లి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. 2024లో ఏపీలో ఉమ్మడిగా అధికారంలోకి రావాలని అడుగులు వేస్తున్నారు. ఇందుకు జాతీయస్థాయి బీజేపీ నాయకత్వం పవన్ తో పొత్తు విషయంలో సహాయ సహకారాల్లో ముందు ఉంటోంది. ఏపీలో బీజేపీ అంత సుముఖంగా లేదని పవన్ చేసిన వ్యాఖ్యలు కలవరం రేపాయి. మరునాడే పవన్ ను సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలుసుకుని తమ మధ్య పొరపొచ్చాలు లేవని చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకూ ఏపీలోనే యాక్టివ్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలో కూడా యాక్టివ్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అయితే.. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉందా అనేది ఇప్పటికీ సందేహమే. ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అంతగా జనసేనను పట్టించుకోలేదు. దీంతో జనసేన నాయకులే నామినేషన్లు వేశారు. అయితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి రెండు పార్టీల మధ్య సయోధ్య చేశారు. జనసేన నాయకులు నామినేషన్లు వెనక్కు తీసుకునేలా చేశారు. మొత్తానికి తెలంగాణ బీజేపీ నుంచి మాత్రం పవన్ తో స్నేహంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంత సానుకూల ప్రకటన ఎప్పుడూ చేయలేదు.
ఆ రాష్ట్ర బీజేపీ నేతల తీరు కూడా ఇలానే ఉందని చెప్పాలి. బీజేపీ అగ్ర నాయకత్వం పవన్ పై చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్రాల్లో లేదా అనే సందేహాలే వ్యక్తమవుతున్నాయి. ఇటివల మరో బీజేపీ నేత డీకే అరుణ కూడా పవన్ జనసేనతో తమకు తెలంగాణలో పొత్తు లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం విశేషం. మరి తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తుందో లేదో చూడాలి. ఈ అంశాలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మొత్తంగా జనసేన-బీజేపీ మితృత్వం తడబడుతూ అడుగులు వేస్తుందనే చెప్పాలేమో..!!